ములుగు, జూలై 21(నమస్తే తెలంగాణ): రామప్ప సరస్సులో నీళ్లున్నా వరి పంటకు మాత్రం ఇచ్చేది లేదంటూ అధికారులు పేర్కొనడంతో ఆయకట్టు రైతులు ఆందోళన చెందుతున్నారు. ములుగు జిల్లా వెంకటాపూర్ మం డలం పాలంపేటలోని కాకతీయుల కాలం నాటి రామప్ప సరస్సు కింద 5,100 ఎకరాల్లో రైతులు వరి సాగు చేస్తుండగా అనధికారికంగా మరో 5వేల ఎకరాల్లో ములుగు, జయశంకర్ భూపాలపల్లి జిల్లాలకు చెందిన 3,500 మంది రైతులు ఏటా రెండు పంటలను సాగు చేస్తున్నారు. ఎల్ నినో కారణంగా వర్షాలపై ఆశలు వదులుకున్న అధికారులు ఈ నెల 19న రామప్ప సరస్సు కింద ఆయకట్టుకు నీరు అందించే నాలుగు కాలువల తూములను మూసివేసి నీటిని నిలిపివేశారు. రామప్ప సరస్సు కింద ములుగు, వెంకటాపూర్, గణపురం మండలాల పరిధిలోని 15 గ్రామాలకు చెందిన రైతులు 10వేల ఎకరాల్లో వరి సాగు చేస్తున్నారు. ఇప్పటికే 800ఎకరాల్లో రైతులు రామప్ప ఆయకట్టు కింద విడుదల చేసిన నీటితో నాట్లు వేశారు. మిగిలిన రైతులు నాటు వేసేందుకు సిద్ధమవుతున్న క్రమంలో నీటి పారుదలశాఖ అధికారులు కాలువలకు సాగునీటిని నిలిపివేయడంతో తీవ్ర ఆందోళన చెందుతున్నారు.
ఆరుతడి పంటలు వేసుకోవాలని హుకుం
రామప్ప సరస్సు కింద ప్రస్తుత వానకాలంలో రైతులంతా వరి పంట వేయకుండా ఆరుతడి పంటలను మాత్రమే సాగు చేయాలని నీటి పారుదల శాఖ అధికారులతోపాటు వ్యవసాయ అధికారులు రైతులకు ఆదేశాలు జారీచేశారు. అధికారులు సాగునీటిని ఇవ్వలేమని తేల్చి చెప్పడంతో సోమవారం రైతులంతా పాలంపేట రైతు వేదికలో సమావేశమై సాగునీరు అందించాలని కలెక్టరేట్లో ప్రజావాణి కార్యక్రమంలో ఉన్నతాధికారులకు విజ్ఞప్తి చేశారు. మంగళవారం హనుమకొండ కలెక్టరేట్లో జరిగిన వరంగల్ ఉమ్మడి జిల్లా సమీక్షలో మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డితోపాటు ఇతర అధికారులకు వినతిపత్రం సమర్పించినా సాగు నీటి విడుదలపై స్పష్టత రాలేదు. అధికారులు వరి పంటకు సాగు నీటిని అందించేది లేదని, ఆరు తడి పంటలను మాత్రమే వేయాలనడంతో సాగుకు సన్నద్ధమైన రైతులతో పాటు ఇప్పటికే నాటు వేసిన రైతులు ఆందోళనలు చేపట్టేందుకు సిద్ధమవుతున్నారు. రామప్ప సరస్సులో ప్రస్తుతం 26 అడుగుల నీటి మట్టం ఉండగా వానకాలంతోపాటు యాసంగిలో సాగునీటితో పాటు తాగునీటికి ఎలాంటి ఇబ్బందులు ఉండవని రైతులు పేర్కొంటున్నారు. బుధ, గురు వారాల్లో రామప్ప ఆయకట్టు రైతులంతా ఒక్క తాటిపైకి వచ్చి సాగు నీటిని సాధించుకునేందుకు ఉద్యమ కార్యాచరణ రూపొందించేందుకు సన్నద్ధమవుతున్నారు.