కోస్గి, నవంబర్ 8 : నారాయణపేట జిల్లా కోస్గిలోని ప్రభుత్వ కళాశాల క్రీడా మైదానంలో అండర్-17 ఎస్జీఎఫ్ 69వ రాష్ట్ర స్థాయి హ్యాండ్బాల్ పోటీలు శనివారం ప్రారంభమయ్యాయి. రాష్ట్రంలోని ఉమ్మడి పది జిల్లాల నుంచి 320 మంది ప్లేయర్లు పోటీలో ఉన్నారు. ఒక్కో జిల్లా నుంచి బాలురు, బాలికల రెండు జట్ల చొప్పున పాల్గొంటున్నాయి. తొలిరోజు బాలికల విభాగంలో జరిగిన తొలి మ్యాచ్లో ఆదిలాబాద్ 11-2తో వరంగల్పై గెలిచింది.
నిజామాబాద్ 5-1తో ఖమ్మంపై, మహబూబ్నగర్ 7-0తో రంగారెడ్డిపై, నల్లగొండ 10-3తో హైదరాబాద్పై గెలిచి ముందంజ వేశాయి. బాలుర విభాగంలో మహబూబ్నగర్ జట్టు హైదరాబాద్పై 18-6తో, రంగారెడ్డిపై 13-7తో, ఖమ్మంపై 15-9తో గెలిచి సత్తాచాటింది. మిగతా మ్యాచ్ల్లో కరీంనగర్ 16-7తో నల్లగొండపై, వరంగల్ 11-9తో కరీంనగర్పై, ఆదిలాబాద్పై 13-5తో, నిజామాబాద్పై 9-6తో, నల్లగొండపై 6-4తో విజయం సాధించాయి. ఆదివారం జరుగనున్న సెమీస్లో ఆదిలాబాద్-కరీంనగర్, మెదక్-మహబూబ్నగర్ బాలికల జట్లు తలపడనున్నాయి.
అరకొర వసతుల మధ్య..
సీఎం రేవంత్రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న కొడంగల్ నియోజకవర్గంలోని కోస్గి పట్టణంలో నిర్వహిస్తున్న రాష్ట్ర స్థాయి హ్యాండ్బాల్ టోర్నీ అరకొర వసతుల మధ్య ప్రారంభమైంది. క్రీడాకారులకు సౌకర్యాలు కల్పించడంలో నిర్వాహకులు పూర్తిగా విఫలమయ్యారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. పోటీలను తిలకించడానికి వచ్చిన అభిమానులు, స్థానికులు కూర్చోవడానికి సరైన సౌకర్యాలు కరువయ్యాయి. వంటలు వండే ప్రాంతంలో పందులు స్వైరవిహారం చేస్తుండటంపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.