షిల్లాంగ్: జాతీయ బాక్సింగ్ చాంపియన్షిప్లో స్టార్ బాక్సర్లు శివ తాపా, అమిత్ పంగల్ పసిడి పతకాలతో మెరిశారు. శుక్రవారం జరిగిన పురుషుల 51కిలోల ఫైనల్ బౌట్లో అమిత్ 5-0తో అన్షుల్ పునియాపై అలవోక విజయం సాధించాడు. ప్రపంచ చాంపియన్షిప్, ఆసియాగేమ్స్కు దూరమైన అమిత్…జాతీయ టోర్నీలో సత్తాచాటాడు. ఆది నుంచే తనదైన దూకుడు కొనసాగించిన అమిత్..ప్రత్యర్థిపై పదునైన పంచ్లతో విరుచుకుపడ్డాడు.
పవర్ఫుల్ పంచ్లకు తోడు జాబ్స్, హుక్స్తో చెలరేగిన పంగల్ కీలక పాయింట్లు ఖాతాలో వేసుకున్నాడు. జాతీయ టోర్నీలో పసిడి ద్వారా రానున్న పారిస్ (2024) ఒలింపిక్స్కు బెర్తు దక్కించుకోవాలనే పట్టుదలతో ఉన్నాడు. మరోవైపు ఆరుసార్లు ఆసియా చాంపియన్ శివ తాపా..వంశజ్పై ఏకపక్ష విజయం సాధించాడు. శివ సంధించిన పంచ్లకు వంశజ్ నుంచి సరైన సమాధానం లేకపోయింది. సచిన్ సివాచ్(57కి), లక్ష్యయ్ చాహర్(80కి), సంజీత్(92కి) టైటిళ్లు దక్కించుకున్నారు.