హైదరాబాద్, జూలై 4 (నమస్తే తెలంగాణ): తెలంగాణలో స్పోర్ట్స్ విలేజ్ రూపకల్పనపై రాష్ట్ర ప్రభుత్వం విస్తృతంగా అధ్యయనం చేస్తున్నది. ప్రపంచ స్థాయి ప్రమాణాలకు అనుగుణంగా క్రీడా ప్రాంగణాలను తీర్చిదిద్దాలని కసరత్తు చేపట్టింది. ఈ ప్రక్రియలో భాగంగా సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు మంత్రులు శ్రీనివాస్గౌడ్, గంగుల కమలాకర్, ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు వినోద్కుమార్ దక్షిణ కొరియాలో పర్యటిస్తున్నారు.
ఆ దేశ రాజధాని సియోల్లో ఒలింపిక్స్ కోసం నిర్మించిన స్టేడియాలను మంగళవారం వారు పరిశీలించారు. భవిష్యత్తులో ఒలింపిక్స్, ఏషియన్ గేమ్స్ వంటి అంతర్జాతీయ స్థాయి టోర్నీలను నిర్వహించే అవకాశం మన దేశానికి వస్తే.. వాటిని తెలంగాణలో జరిపేందుకు క్రీడా మైదానాలను సిద్ధం చేస్తున్నట్టు వారు వెల్లడించారు. ఈ పర్యటనలో పర్యాటకశాఖ ఎండీ మనోహర్, కరీంనగర్ జిల్లా కలెక్టర్ ఆర్వీ కర్ణన్ పాల్గొన్నారు.