హైదరాబాద్: వన్ డే ప్రపంచకప్లో భాగంగా ఉప్పల్లోని రాజీవ్గాంధీ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో పాకిస్థాన్తో జరుగుతున్న మ్యాచ్లో శ్రీలంక బ్యాటర్ కుశాల్ మెండిస్ వీరవిహారం చేశాడు. కేవలం 65 బంతుల్లోనే సూపర్ డూపర్ సెంచరీ కొట్టాడు. ఫోర్లు, సిక్సర్లతో పాకిస్థాన్ ఫీల్డర్లను మైదానం అంతటా పరుగులు పెట్టించాడు. సెంచరీ తర్వాత కూడా అదే జోరు కొనసాగిస్తూ 29వ ఓవర్ ఐదో బంతికి తన 122 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద అవుటయ్యాడు.
మెండిస్ (122; 14 ఫోర్లు, 6 సిక్సర్లు) ఔటయ్యేటప్పటికి శ్రీలంక స్కోర్ మూడు వికెట్ల నష్టానికి 218 పరుగులు. కుశాల్ మెండిస్ అవుటైనా పాకిస్థాన్ కష్టాలు తీరలేదు. పాక్ ఫీల్డర్లను పరుగులు పెట్టించే బాధ్యతను సమరవిక్రమ నెత్తికెత్తుకున్నాడు. శ్రీలంక జోరు చూస్తుంటే పాకిస్థాన్ ముందు 350 పరుగులకు పైగా లక్ష్యాన్ని ఉంచే సూచనలు కనిపిస్తున్నాయి.