డిఫెండింగ్ చాంపియన్ ఇంగ్లండ్ కథ ముగిసింది. హ్యాట్రిక్ పరాజయాలతో నాలుగో ఓటమిని మూటగట్టుకున్న ఇంగ్లిష్ జట్టు సెమీఫైనల్ రేసు నుంచి నిష్క్రమించింది. చిన్నస్వామి లాంటి చిన్న స్టేడియంలో మొదట బ్యాటింగ్ ఎంచుకున్న బట్లర్ సేన.. బిందాస్గా బాదుతుందనుకుంటే అందుకు పూర్తి భిన్నంగా 156 పరుగులకే కుప్పకూలింది. పెద్దగా అనుభవం లేని లంక బౌలర్లను ఎదుర్కొనేందుకు తడబడ్డ ప్రపంచ చాంపియన్.. బౌలింగ్లోనూ ఎలాంటి మ్యాజిక్ చేయలేకపోయింది!
CWC | బెంగళూరు: వన్డే ప్రపంచకప్లో శ్రీలంక కీలక విజయం ఖాతాలో వేసుకుంది. గురువారం జరిగిన పోరులో శ్రీలంక 8 వికెట్ల తేడాతో డిఫెండింగ్ చాంపియన్ను ఇంగ్లండ్ను మట్టికరిపించింది. వరల్డ్కప్లో లంక చేతిలో ఇంగ్లండ్కు ఇది వరుసగా ఐదో పరాజయం కాగా.. చివరిసారి ఇంగ్లిష్ జట్టు 1999 మెగాటోర్నీలో లంకను జయించింది.
ఇప్పటి వరకు ఈ టోర్నీలో ఆడిన ఐదు మ్యాచ్ల్లో కేవలం ఒక్క దాంట్లోనే (బంగ్లాదేశ్పై) గెలిచిన బట్లర్సేన 2 పాయింట్లతో పట్టికలో కింది నుంచి రెండో స్థానంలో నిలిచింది. టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ ఎంచుకున్న ఇంగ్లండ్.. 33.2 ఓవర్లలో 156 పరుగులకు ఆలౌటైంది. బెన్ స్టోక్స్ (43; 6 ఫోర్లు) టాప్ స్కోరర్ కాగా.. ఓపెనర్లు జానీ బెయిర్స్టో (30), డేవిడ్ మలాన్ (28) పర్వాలేదనిపించారు. జో రూట్ (3), బట్లర్ (8), లివింగ్స్టోన్ (1), మోయిన్ అలీ (15), క్రిస్ వోక్స్ (0) విఫలమయ్యారు. లంక బౌలర్లలో లహిరు కుమార 3, ఏంజెలో మాథ్యూస్, కసున్ రజిత చెరో రెండు వికెట్లు ఖాతాలో వేసుకున్నారు.
అనంతరం లక్ష్యఛేదనలో లంక 25.4 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 160 పరుగులు చేసింది. పాథుమ్ నిషాంక (77 నాటౌట్; 7 ఫోర్లు, 2 సిక్సర్లు), సదీర సమరవిక్రమ (65; 7 ఫోర్లు, ఒక సిక్సర్) అజేయ అర్ధశతకాలతో జట్టును విజయ తీరాలకు చేర్చారు. ఒక దశలో 23/2తో కష్టాల్లో పడ్డట్లు కనిపించగా.. వీరిద్దరూ మూడో వికెట్కు అజేయంగా 137 పరుగులు జోడించి జట్టును గెలిపించారు. ఇంగ్లండ్ బౌలర్లలో డేవిడ్ విల్లీ 2 వికెట్లు పడగొట్టాడు. లహిరు కుమారకు ‘మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు దక్కింది.
సంక్షిప్త స్కోర్లు
ఇంగ్లండ్: 33.2 ఓవర్లలో 156 ఆలౌట్ (బెన్ స్టోక్స్ 43; లహిరు 3/35, మాథ్యూస్ 2/14), శ్రీలంక: 25.4 ఓవర్లలో 160/2 (నిషాంక 77 నాటౌట్, సమరవిక్రమ 65 నాటౌట్; విల్లీ 2/30).
ఖేల్ ఖతం!
ఎంతలో ఎంత మార్పు..! నెల రోజుల క్రితం వన్డే ప్రపంచకప్ సన్నాహాలు జరుగుతుండగా.. ఈ సారి ఏ జట్టు ప్రపంచకప్ గెలుస్తుందని ఎవరిని అడిగినా.. మొదటి జవాబు ఇంగ్లండ్ అనే వచ్చింది. అంతెందుకు పుష్కర కాలం తర్వాత స్వదేశంలో ప్రపంచకప్ జరుగుతుంటే.. భారత దిగ్గజ ఆటగాడు సునీల్ గవాస్కర్ టీమ్ఇండియాను తోసిరాజని ఇంగ్లిష్ టీమ్కు ఓటేశాడు. గత కొంతకాలంగా వాళ్ల ఊపు చూసిన వారెవరికైనా ఇది పెద్ద ఆశ్చర్యంగా అనిపించలేదు.
కానీ డిఫెండింగ్ చాంపియన్గా బరిలోకి దిగిన ఇంగ్లండ్ మాత్రం ఈ టోర్నీలో పూర్తిగా నిరాశ పరిచింది. ఇంగ్లిష్ జట్టు మైదానంలో ఉందంటే చాలు.. స్టాండ్స్లో విపరీతమైన సందడి చేసే ‘బార్మీ ఆర్మీ’ సైతం ఆ టీమ్ ప్రదర్శనపై పెదవి విరుస్తున్నది. తొలి పోరులో న్యూజిలాండ్ చేతిలో ఓటమి పాలైనా.. ఒక్కటేగా అని సర్ది చెప్పుకున్న అభిమానులకు.. బంగ్లాదేశ్పై విజయం కాస్త ఊరటనిచ్చింది. ఇక ఆ తర్వాత నుంచి బట్లర్ సేన ప్రదర్శన నానాటికీ తీసికట్టులా మారుతూ పాతాళానికి చేరింది. ఒకటి నుంచి పదో స్థానం వరకు హిట్టర్లతో దట్టంగా ఉన్న ఇంగ్లండ్ టీమ్ ఒక్క బంగ్లాపై తప్ప మరే మ్యాచ్లోనూ స్థాయికి తగ్గ ప్రదర్శన చేయలేకపోయింది.
గత మ్యాచ్లో దక్షిణాఫ్రికా నిర్దేశించిన 400 పరుగుల లక్ష్యఛేదనలో 170కే ఆలౌటైన ఇంగ్లండ్.. ఈసారి అంతకుమించి అన్నట్లు బెంగళూరులో తొలుత బ్యాటింగ్ చేస్తూ 156 రన్స్కే చాపచుట్టేసింది. 2015 ప్రపంచకప్ తర్వాత ఉత్తుంగ తరంగంలా రివ్వున పైకెగిరిన ఇంగ్లండ్.. అంతే వేగంగా పతనావస్థకు చేరడం క్రికెట్కు పుట్టినిైల్లెన ఆ దేశ అభిమానులకు ఏమాత్రం రుచించడం లేదనేది ముమ్మాటికీ వాస్తవం. బెయిర్స్టో, మలాన్, రూట్, స్టోక్స్, బట్లర్, బ్రూక్, లివింగ్స్టోన్, మోయిన్ అలీ, క్రిస్ వోక్స్ ఇలా చెప్పుకోవడానికి స్టార్లకు కొదవలేకపోయినా.. ఒక్కరంటే ఒక్కరు కూడా స్థాయికి తగ్గ ప్రదర్శన చేయలేకపోయారు. లంకతో మ్యాచ్లో ఆదిల్ రషీద్ రనౌట్ అయిన తీరు చూస్తే.. ఇంగ్లండ్ జట్టు మానసిక స్థితి ఏంటో అర్థం చేసుకోవచ్చు.
-నమస్తే తెలంగాణ క్రీడావిభాగం