Srilanka | సిల్హెట్: బంగ్లాదేశ్ స్వదేశంలో జరుగుతున్న రెండు టెస్టుల సిరీస్లో భాగంగా సోమవారం ముగిసిన తొలి టెస్టులో బంగ్లాదేశ్ చిత్తుగా ఓడింది. రెండో ఇన్నింగ్స్లో 511 పరుగుల భారీ ఛేదనలో బరిలోకి దిగిన బంగ్లా.. 182 పరుగులకే కుప్పకూలి ఘోర పరాభవాన్ని మూటగట్టుకోగా.. లంకేయులు 328 రన్స్ తేడాతో గ్రాండ్ విక్టరీ కొట్టారు.
తొలి ఇన్నింగ్స్లో మూడు వికెట్లు తీసిన లంక పేసర్ కసున్ రజిత రెండో ఇన్నింగ్స్లో ఫైఫర్ (5/56) తో రాణించి బంగ్లా ఓటమిని శాసించాడు. అతడికి తోడు విశ్వ ఫెర్నాండో (3/36), లాహిరు కుమార (2/39) రాణించడంతో లంకకు భారీ విజయం దక్కింది. బంగ్లా బ్యాటర్లలో మోమినుల్ హక్ (87) టాప్ స్కోరర్.