సన్రైజర్స్ హైదరాబాద్ అదరగొట్టింది. సొంత ఇలాఖాలోరాజస్థాన్ రాయల్స్ను చిత్తు చేస్తూ ప్లేఆఫ్స్ రేసులో ముందంజ వేసింది. వరుసగా రెండు ఓటములతో బరిలోకి దిగిన సన్రైజర్స్..రాయల్స్తో మ్యాచ్లో సత్తాచాటింది. నితీశ్కుమార్రెడ్డి, హెడ్ అర్ధసెంచరీలతో పోరాడే స్కోరు అందుకున్న హైదరాబాద్.. రాజస్థాన్ను ఆఖరి బంతికి కట్టడి చేసి అద్భుత విజయాన్ని ఖాతాలో వేసుకుంది. జైస్వాల్, పరాగ్ అర్ధసెంచరీలతో రాణించినా..రాయల్స్ గెలుపు వాకిట పరుగు తేడాతో బోల్తా కొట్టింది. రాజస్థాన్పై విజయంతో హైదరాబాద్..ప్లేఆఫ్స్ రేసులో ముందడుగు వేసింది.
IPL | హైదరాబాద్, ఆట ప్రతినిధి: ఐపీఎల్లో మరోమారు పోరు అభిమానులను కట్టిపడేసింది. గురువారం ఉప్పల్ స్టేడియంలో ఆఖరి బంతి వరకు ఉత్కంఠగా సాగిన మ్యాచ్లో హైదరాబాద్ 1 పరుగు తేడాతో రాజస్థాన్పై అద్భుత విజయం సాధించింది. తొలుత నితీశ్కుమార్రెడ్డి(42 బంతుల్లో 76 నాటౌట్, 3 ఫోర్లు, 8సిక్స్లు), హెడ్(58) బ్యాటింగ్తో హైదరాబాద్ 20 ఓవర్లలో 201-3 స్కోరు చేసింది. అవేశ్ఖాన్ (2-39) ఆకట్టుకున్నాడు. ఆ తర్వాత లక్ష్యఛేదనలో రాజస్థాన్ 20 ఓవర్లలో 200-7 స్కోరు చేసింది. పరాగ్ (77), జైస్వాల్ (67) అర్ధసెంచరీలతో ఆకట్టుకున్నారు. భువనేశ్వర్ (3-41) మూడు వికెట్లు తీయగా, కమిన్స్, నటరాజన్ రెండేసి వికెట్లు తీశారు. భువనేశ్వర్కు ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ దక్కింది.
నితీశ్ అదుర్స్ : తొలుత టాస్ గెలిచిన సన్రైజర్స్ తమకు అనుకూలమైన బ్యాటింగ్ వైపు మొగ్గుచూపింది. బౌల్ట్ వేసిన ఇన్నింగ్స్ తొలి ఓవర్ మొదటి బంతికే హెడ్ ఔటయ్యే ప్రమాదం నుంచి బయటపట్టాడు. భారీ షాట్ ఆడబోయిన అభిషేక్(12).. జురెల్కు క్యాచ్ ఇచ్చి తొలి వికెట్గా వెనుదిరిగాడు. ఆ తర్వాత హెడ్కు నితీశ్కుమార్రెడ్డి చక్కని సహకారం అందించాడు. మందకోడిగా సాగుతున్న ఇన్నింగ్స్లో బౌల్ట్ బౌలింగ్లో హెడ్ అర్ధసెంచరీ మార్క్ అందుకున్నాడు. చాహల్ వేసిన ఇన్నింగ్స్ 13వ ఓవర్లో నితీశ్కుమార్ 6, 4, 6, 4 కొట్టడంతో ఏకంగా 21 పరుగులు వచ్చాయి. బౌలింగ్ మార్పుగా వచ్చిన అవేశ్ఖాన్.. 15వ ఓవర్లో సిక్స్తో ఊపు మీద కనిపించినా..రెండు బంతుల తేడాతో క్లీన్బౌల్డ్గా వెనుదిరిగాడు. ఓవైపు వికెట్లు పడుతున్నా..నితీశ్ చక్కని పరిణితి కనిబరిచాడు. అశ్విన్ ఇన్నింగ్స్ 16వ ఓవర్లో 30 బంతుల్లో అర్ధసెంచరీ మార్క్ అందుకున్న నితీశ్.. వరుసగా రెండు సూపర్ సిక్స్లతో స్కోరుబోర్డుకు ఊపుతెచ్చాడు. హెడ్ స్థానంలో బ్యాటింగ్కు వచ్చిన క్లాసెన్ సుడిగాలి ఇన్నింగ్స్తో ఆకట్టుకున్నాడు.
పరాగ్, జైస్వాల్ విజృంభణ : 202 పరుగుల లక్ష్యఛేదనలో రాజస్థాన్కు ఆదిలోనే కోలుకోలేని ఎదురుదెబ్బ తగిలింది. భువనేశ్వర్ వేసిన ఇన్నింగ్స్ తొలి ఓవర్లలోనే ఓపెనర్ బట్లర్(0), కెప్టెన్ శాంసన్(0) కనీసం పరుగుల ఖాతా తెరువకుండానే పెవిలియన్ చేరాడు. ఇన్నింగ్స్ను చక్కదిద్దే బాధ్యతను భుజానేసుకున్న పరాగ్.. జైస్వాల్తో కలిసి స్కోరుబోర్డును ముందుకు నడిపించాడు. 10 ఓవర్లు ముగిసేసరికి రాయల్స్ 2 వికెట్లు కోల్పోయి 100 పరుగులు చేసింది. ప్రమాదకరంగా మారుతున్న ఈ జోడీని నటరాజన్ 14వ ఓవర్లో జైస్వాల్ను ఔట్ చేయడం ద్వారా 134 పరుగుల భాగస్వామ్యానికి బ్రేక్ పడింది. కమిన్స్ వేసిన ఇన్నింగ్స్ 16వ ఓవర్లో పరాగ్.. జాన్సెన్కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. దీంతో రైజర్స్ తిరిగి పోటీలోకి వచ్చింది. ఈ క్రమంలో నటరాజన్ వేసిన ఇన్నింగ్స్ 18వ ఓవర్లో హెట్మైర్(13) కూడా ఔట్ కావడంతో రాయల్స్ ఇబ్బందుల్లో పడింది. రెండు బంతుల తేడాతో జురెల్(1) కూడా ఔట్ కావడంతో రైజర్స్ గెలుపు గాడిలోకి వచ్చింది.
భువనేశ్వర్ వేసిన ఇన్నింగ్స్ ఆఖరి ఓవర్లో విజయానికి 13 పరుగుల అవసరమైన దశలో రోవ్మన్ పావెల్ రెండో బంతికి ఫోర్ బాదాడు. ఆఖరి బంతికి రెండు పరుగులు చేస్తే గెలుపు ఖాయమన్న స్థితిలో పావెల్ను భువీ వికెట్ల ముందు ఎల్బీడబ్ల్యూగా దొరకబుచ్చుకున్నాడు. దీంతో పరుగు తేడాతో హైదరాబాద్..రాజస్థాన్పై ఉత్కంఠ విజయం సాధించింది.
హైదరాబాద్: 20 ఒవర్లలో 201-3(నితిశ్కుమార్ 76 నాటౌట్, క్లాసెన్ 42 నాటౌట్, అవేశ్ఖాన్ 2-39, సందీప్శర్మ 1-31),
రాజస్థాన్: 20 ఓవర్లలో 200-7(పరాగ్ 77, జైస్వాల్ 67, భువనేశ్వర్ 3-41, కమిన్స్ 2-34).