తీవ్ర ఒత్తిడి మధ్య బరిలోకి దిగిన ఇరు జట్లలో.. యువ ఆటగాళ్లు సత్తా చాటడంతో సన్రైజర్స్ హైదరాబాద్ గెలుపు రుచి చూసింది. తొలి రెండు మ్యాచ్ల్లో పెద్దగా ప్రభావం చూపలేక పోయిన టాపార్డర్ సమిష్టిగా సత్తాచాటడంతో తాజా సీజన్లో రైజర్స్ తొలి విజయాన్ని నమోదు చేసుకుంది. బంతితో వాషింగ్టన్ సుందర్, నటరాజన్ విజృంభించగా.. బ్యాట్తో అభిషేక్ శర్మ, కేన్ విలియమ్సన్, రాహుల్ త్రిపాఠి రాణించారు. దీంతో డిఫెండింగ్ చాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్కు వరుసగా నాలుగో మ్యాచ్లోనూ పరాజయం తప్పలేదు!
ముంబై: ఐపీఎల్ 15వ సీజన్లో సన్రైజర్స్ హైదరాబాద్ ఎట్టకేలకు బోణీ కొట్టింది. తొలి రెండు మ్యాచ్ల్లో పేలవ ప్రదర్శన కనబర్చిన విలియమ్సన్ సేన.. శనివారం డిఫెండింగ్ చాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్పై 8 వికెట్ల తేడాతో గెలుపొందింది. తాజా సీజన్లో జడ్డూ సేనకు ఇది వరుసగా నాలుగో పరాజయం కావడం గమనార్హం. మొదట కట్టుదిట్టమైన బౌలింగ్తో చెన్నైని తక్కువ పరుగులకే కట్టడి చేసిన హైదరాబాద్.. యువ ఆటగాళ్లు అభిషేక్ శర్మ (50 బంతుల్లో 75; 5 ఫోర్లు, 3 సిక్సర్లు), రాహుల్ త్రిపాఠి (15 బంతుల్లో 39; 5 ఫోర్లు, 2 సిక్సర్లు) దంచికొట్టడంతో సీజన్లో తొలి విజయాన్ని నమోదు చేసుకుంది. టాస్ ఓడి మొదట బ్యాటింగ్కు దిగిన చెన్నై నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లకు 154 పరుగులు చేసింది.
మోయిన్ అలీ (48; 3 ఫోర్లు, 2 సిక్సర్లు) టాప్ స్కోరర్ కాగా.. అంబటి రాయుడు (27), కెప్టెన్ రవీంద్ర జడేజా (23) ఫర్వాలేదనిపించారు. రైజర్స్ బౌలర్లలో వాషింగ్టన్ సుందర్, నటరాజన్ చెరో రెండు వికెట్లు పడగొట్టారు. అనంతరం లక్ష్యఛేదనలో హైదరాబాద్ 17.4 ఓవర్లలో 2 వికెట్లు మాత్రమే కోల్పోయి 155 పరుగులు చేసింది. ఓపెనర్ అభిషేక్ శర్మ తనపై పెట్టుకున్న అంచనాలను నిజం చేయగా.. కేన్ విలియమ్సన్ (40 బంతుల్లో 32; 2 ఫోర్లు, ఒక సిక్సర్) కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడాడు. ఐపీఎల్లో తొలి అర్ధశతకం నమోదు చేసుకున్న అభిషేక్కు ‘మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు దక్కింది. లీగ్ దశలోని 14 మ్యాచ్ల్లో తొలి నాలుగింట ఓడిన చెన్నై.. ఇక ప్లే ఆఫ్స్కు చేరాలంటే మిగిలిన 10 మ్యాచ్ల్లో కనీసం ఎనిమిదింట నెగ్గాల్సిన పరిస్థితి నెలకొంది.
రాత మారని చెన్నై సూపర్ కింగ్స్
లీగ్ ప్రారంభం నుంచి జట్టును నడిపిస్తున్న మహేంద్రసింగ్ ధోనీ కెప్టెన్సీ నుంచి తప్పుకోవడంతోనే చెన్నై రాతా మారిపోయింది. తీవ్ర ఒత్తిడిలోనూ ప్రశాంతంగా నిర్ణయాలు తీసుకుంటూ.. తన అద్భుత క్రికెటింగ్ బుర్రతో జట్టును నడిపించిన ధోనీ.. బాధ్యతలను జడేజాకు అప్పగించగా.. అతడు జట్టును గెలుపు బాట పట్టించలేకపోతున్నాడు. రైజర్స్తో పోరు అనగానే చెన్నై ఖాతా తెరవడం ఖాయమే అని అంతా అనుకున్నా.. విలియమ్సన్ సేన అంచనాలను తలకిందులు చేసింది. మొదట బ్యాటింగ్కు దిగిన చెన్నైకి శుభారంభం దక్కలేదు. ఊతప్ప (15), గైక్వాడ్ (16)కు మెరుగైన ఆరంభాలు లభించినా వాటిని భారీ స్కోర్లుగా మలచలేకపోయారు. మిడిల్ ఓవర్స్లో అలీ, రాయుడు కాస్త పోరాడటంతో ఒక దశలో చెన్నై 98/2తో మెరుగ్గానే కనిపించింది. అయితే ఈ ఇద్దరితో పాటు దూబే (3), ధోనీ (3) ఒకరి వెంట ఒకరు పెవిలియన్ చేరడంతో చెన్నై ఓ మాదిరి స్కోరుకే పరిమితమైంది.
సంక్షిప్త స్కోర్లు
చెన్నై: 20 ఓవర్లలో 154/7 (మోయిన్ అలీ 48, రాయుడు 27; సుందర్ 2/21, నటరాజన్ 2/30), హైదరాబాద్: 17.4 ఓవర్లలో 155/2 (అభిషేక్ 75, త్రిపాఠి 39 నాటౌట్; బ్రేవో 1/29).
షేక్ ఆడించిన అభిషేక్..
మెగావేలంలో అనూహ్య ధర పెట్టి తిరిగి కొనుగోలు చేసుకున్న అభిషేక్ శర్మ ఈ మ్యాచ్లో విజృంభించాడు. లక్ష్యం మరీ పెద్దది కాకపోవడంతో కెప్టెన్ విలియమ్సన్తో కలిసి జట్టును ముందుకు నడిపించాడు. ఈ జోడీ వన్డే తరహాలో ఆడటంతో పవర్ప్లే ముగిసేసరికి హైదరాబాద్ వికెట్ నష్టపోకుండా 37 పరుగులు చేసింది. ఆ తర్వాత కూడా అడపాదడపా మంచి షాట్లు ఆడిన వీరిద్దరూ ఏ దశలోనూ సాధించాల్సిన రన్రేట్ను చేయి దాటిపోకుండా చూసుకున్నారు. ఈ క్రమంలో అభిషేక్ 32 బంతుల్లో హాఫ్ సెంచరీ నమోదు చేసుకోగా.. మొదటి వికెట్కు 89 పరుగులు జోడించిన అనంతరం విలియమ్సన్ ఔటయ్యాడు. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన రాహుల్ త్రిపాఠి ధాటిగా ఆడటంతో పెద్ద ఇబ్బంది లేకుండానే రైజర్స్ గెలుపు తీరాలకు చేరింది.