WFI : భారత రెజ్లింగ్ సమాఖ్య అధ్యక్షుడిగా బ్రిజ్ భూషణ్(Brij Bhushan) సన్నిహితుడు సంజయ్ సింగ్(Sanjay Singh) ఎన్నిక కావడం పెద్ద దుమారం రేపిన విషయం తెలిసిందే. అయితే.. రెజ్లర్లపై గెలుపొందామనే సంతోషంలో ఉన్న భూషణ్, సంజయ్ బృందానికి పెద్ద షాక్ తగిలింది. కొత్తగా ఎన్నికైన రెజ్లింగ్ సమాఖ్యను ఆదివారం భారత క్రీడా మంత్రిత్వ(Sports Ministry) శాఖ రద్దు చేసింది. దాంతో, రెజ్లర్లు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
ఎన్నికల్లో గెలిచిన అనంతరం క్రీడా శాఖను సంప్రదించకుండానే సంజయ్ జాతీయ స్థాయి అండర్ -15, అండర్-20 రెజ్లింగ్ పోటీలు ఉత్తరప్రదేశ్లో జరుగుతాయని ప్రకటించాడు. దాంతో సంజయ్.. జాతీయ క్రీడా నిబంధనలను ఉల్లంఘించారని అతడి బృందాన్ని సస్పెండ్ చేస్తున్నట్లు మంత్రిత్వ శాఖ ప్రకటించింది. అంతేకాదు తదుపరి ప్రకటన వెల్లడించేంత వరకూ సస్పెన్షన్ కొనసాగతుందని తెలిపింది.
రెజ్జింగ్ సమాఖ్య అధ్యక్షుడిగా బ్రిజ్ భూషణ్ సన్నిహితుడు సంజయ్ సింగ్ డిసెంబర్ 21న గెలుపొందాడు. అతడి విజయానికి నిరసనగా స్టార్ రెజ్లర్ సాక్షి మాలిక్(Sakshi Malik) తాను ఇక కుస్తీని వదిలేస్తున్నానని కన్నీటి పర్యంతమైంది. ఒలింపిక్ విజేత భజ్రంగ్ పూనియా(Bajran Punia) తన పద్మశ్రీ అవార్డును తిరిగిచ్చేశాడు. మరో రెజ్లర్ వీరేందర్ సింగ్ తన పద్మ శ్రీ అవార్డును వదులుకునేందుకు సిద్ధమయ్యాడు. సాక్షి మాలిక్ను కలిసిన కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంక గాంధీ సంఘీభావం ప్రకటించింది. దాంతో, దేశవ్యాప్తంగా రెజ్లర్లకు మద్దతు పెరగడం గమనించిన క్రీడాశాఖ సంజయ్ సింగ్ బృందాన్ని రద్దు చేస్తూ నిర్ణయం తీసుకుంది.