హైదరాబాద్, ఆట ప్రతినిధి: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్న సీఎం కప్ ఏర్పాట్లు చకచకా సాగుతున్నాయి. 15 రోజుల పాటు రాష్ట్రంలో పండుగ వాతావరణంలో క్రీడలను నిర్వహించేందుకు ప్రభుత్వం సమాయత్తమైంది. సీఎం కప్ టోర్నీకి సంబంధించిన లోగో, మస్కట్ ఆవిష్కరణ శనివారం జరిగింది. క్రీడా మంత్రి శ్రీనివాస్గౌడ్ ముఖ్య అతిథిగా హాజరై లోగోను ఆవిష్కరించారు.
ఈ కార్యక్రమంలో సాట్స్ చైర్మన్ ఆంజనేయగౌడ్, జాతీయ హ్యాండ్బాల్ సంఘం అధ్యక్షుడు జగన్మోహన్రావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ‘దాదాపు 2 లక్షల మంది యువకులను పోటీలో భాగస్వామ్యం చేయాలని క్రీడలను నిర్వహిస్తున్నాం. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు రాష్ట్ర వ్యాప్తంగా టోర్నీ నిర్వహణకు ఏర్పాట్లు చేస్తున్నాం. ఇందుకోసం రూ.3.60 కోట్ల నిధులు కేటాయించాం’అని అన్నారు.