హైదరాబాద్, ఆట ప్రతినిధి: రాష్ర్టాన్ని క్రీడల హబ్గా తీర్చిదిద్దేందుకు సీఎం కేసీఆర్ నాయకత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం పలు అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నదని సాట్స్ చైర్మన్ వెంకటేశ్వర్రెడ్డి పేర్కొన్నారు. అద్భుత ప్రతిభ కల్గిన ప్లేయర్లకు రాష్ట్రంలో కొదువ లేదని వెన్నుతట్టి ప్రోత్సహిస్తే మెరుగైన ఫలితాలు సాధించవచ్చని అన్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న పలు అభివృద్ధి కార్యక్రమాల గురించి ఆయన వివరించారు. హకీంపేట, కరీంనగర్, ఆదిలాబాద్ స్పోర్ట్స్ స్కూల్స్ ద్వారా ప్లేయర్లకు అత్యుత్తమ శిక్షణ అందిస్తున్నాం. ప్రభుత్వం ఉచిత శిక్షణతో పాటు వసతి సదుపాయం కల్పిస్తున్నది. భవిష్యత్లో తెలంగాణ నుంచి పీటీ ఉషా, మల్లీశ్వరి, నీరజ్ చోప్రా, నిఖత్ జరీన్ లాంటి ప్లేయర్లు వెలుగులోకి వస్తారని అన్నారు.
రాష్ట్ర వ్యాప్తంగా క్రీడా ప్రాంగణాలు:
గ్రామాల్లో ప్రతిభ కల్గిన ప్లేయర్లను వెలికి తీసేందుకు సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు ప్రతీ గ్రామ పంచాయతీలో క్రీడా ప్రాంగాణాలు ఏర్పాటు చేస్తున్నాం. ఒక్కో ప్రాంగణం కోసం ప్రభుత్వం ఐదు లక్షలు కేటాయించింది. ఇదిలా ఉంటే మంత్రి హరీశ్రావు సహకారంతో గజ్వేల్లో 20 ఎకరాల స్థలంలో స్పోర్ట్స్ విలేజ్ ఏర్పాటు చేస్తున్నాం. అల్లీపురంలో ఎంపీ సంతోష్కుమార్, స్థానిక ఎంపీ శ్రీనివాస్రెడ్డి సహకారంతో 50లక్షల వ్యయంతో బాక్సింగ్, వెయిట్లిఫ్టింగ్, జిమ్హాల్ను ఏర్పాటు చేస్తున్నట్లు పేర్కొన్నారు.