హైదరాబాద్ : ప్రేమ వివాహం చేసుకున్న భార్య తనను అనుక్షణం చిన్నచూపు చూస్తుండడంతో మనస్థాపానికి గురయిన ఓ వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన నగరంలోని జూబ్లీహిల్స్ పోలీస్స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఎస్పీఆర్ హిల్స్లోని వినాయక్నగర్ బస్తీకి చెందిన కే.సాయికిరణ్(24) స్విగ్గీస్ డెలివరీ బాయ్గా పనిచేస్తుంటారు.
ఏడాదిన్నర క్రితం అదే బస్తీకి చెందిన బీటెక్ విద్యార్థిని హర్షను ప్రేమించి పెళ్లిచేసుకున్నాడు. పెళ్లయిన కొంతకాలం బాగానే ఉన్న భార్యాభర్తల మద్యన విభేదాలు ప్రారంభమయ్యాయి. భర్త చేస్తున్న ఉద్యోగాన్ని చులకన చేస్తూ మాట్లాడడం, చెప్పిన మాట వినకపోవడంతో ఇద్దరి మధ్యన గొడవలు ప్రారంభమయ్యాయి. దీంతో ఎనిమిది నెలల క్రితం పుట్టింటికి వెళ్లిన హర్ష కాపురానికి రావడం లేదు.
ఎన్నిసార్లు పిలిచినా రాకపోవడంతో పాటు తిరస్కారంగా మాట్లాడడంతో మనస్థాపానికి గురైన సాయికిరణ్ ఆదివారం తెల్లవారుజామున ఇంట్లో ఉరేసుకుని ఆత్మహత్యకు ప్రయత్నించాడు. దీంతో కుటుంభ సభ్యులు అతడిని ఉస్మానియా ఆస్పత్రిలో చేర్పించగా చికిత్స పొందుతూ సోమవారం మృతి చెందాడు. ఈ మేరకు మృతుడి సోదరుడు సాయికుమార్ ఇచ్చిన ఫిర్యాదుతో బంజారాహిల్స్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.