ప్రపంచకప్ ప్రారంభమైనప్పటి నుంచి దంచి కొట్టడమే పనిగా పెట్టుకున్న దక్షిణాఫ్రికా ముందు.. పాకిస్థాన్ 271 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. బిగ్ హిట్టర్లతో దట్టంగా ఉన్న సఫారీ టీమ్కు ఇదో లెక్కా అనుకుంటే.. పాక్ బౌలర్లు చివరి వరకు పట్టు వదలక ప్రయత్నించారు! దీంతో ఏకపక్ష పోరాటాలు వీక్షిస్తూ విసిగిపోయిన అభిమానులకు తాజా ప్రపంచకప్లో తొలిసారి ఉత్కంఠ పోరును ఆస్వాదించే అవకాశం దక్కింది.
బంతి బంతికి ఆధిక్యం చేతులు మారుతుంటే.. ఓవర్ ఓవర్కు సమీకరణాలు తారుమారవుతుంటే.. ఆడుతున్నది భారత జట్టు కాకపోయినా చెన్నై చెపాక్ స్టేడియం ఈలలు, కేకలతో మార్మోగిపోయింది. ఒత్తిడిని తట్టుకోలేదనే అపవాదు ఉన్న దక్షిణాఫ్రికా కడవరకు నిలిచి గెలుపు గీత దాటింది.ఆఖర్లో ఉత్కంఠ ఊపేసినా.. చివరి వరుస బ్యాటర్లు పట్టుదల కనబర్చడంతో ఐదో విజయంతో సఫారీ జట్టు పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి దూసుకెళ్లింది.
Cricket World Cup | చెన్నై: వన్డే ప్రపంచకప్లో దక్షిణాఫ్రికా జైత్రయాత్ర కొనసాగుతున్నది. చివరి వరకు నువ్వా నేనా అన్నట్లు సాగిన పోరులో ఒత్తిడిని చిత్తుచేసిన సఫారీ జట్టు విజయ దుందుభి మోగించింది. చెన్నై చెపాక్ వేదికగా శుక్రవారం జరిగిన ఉత్కంఠ పోరులో దక్షిణాఫ్రికా వికెట్ తేడాతో పాకిస్థాన్ను చిత్తు చేసింది. తాజా టోర్నీలో ఆరు మ్యాచ్లాడిన దక్షిణాఫ్రికా.. ఐదో విజయంతో 10 పాయింట్లు ఖాతాలో వేసుకొని టీమ్ఇండియాను వెనక్కి నెట్టి పట్టికలో అగ్రస్థానానికి చేరింది. టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ చేసిన పాకిస్థాన్.. 46.4 ఓవర్లలో 270 పరుగులకు ఆలౌటైంది. కెప్టెన్ బాబర్ ఆజమ్ (50; 4 ఫోర్లు, ఒక సిక్సర్), సౌద్ షకీల్ (52; 7 ఫోర్లు) అర్ధశతకాలతో రాణించగా.. షాదాబ్ ఖాన్ (43; 3 ఫోర్లు, 2 సిక్సర్లు), మహమ్మద్ రిజ్వాన్ (31; 4 ఫోర్లు, ఒక సిక్సర్), మహమ్మద్ నవాజ్ (24; ఒక ఫోర్, 2 సిక్సర్లు) పర్వాలేదనిపించారు. దక్షిణాఫ్రికా బౌలర్లలో తబ్రేజ్ షంసీ 4, మార్కో జాన్సెన్ మూడు వికెట్లు పడగొట్టారు. అనంతరం లక్ష్యఛేదనలో దక్షిణాఫ్రికా 47.2 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 271 పరుగులు చేసింది. ఎయిడెన్ మార్క్మ్ (91; 7 ఫోర్లు, 3 సిక్సర్లు) టాప్ స్కోరర్ కాగా.. మరే ప్లేయర్ ముప్పై పరుగుల మార్క్ దాటలేకపోయాడు. పాక్ బౌలర్లలో షాహీన్ షా అఫ్రిది 3, హరీస్ రవుఫ్, మహమ్మద్ వసీమ్, ఉసామా మీర్ తలా రెండు వికెట్లు పడగొట్టారు. ఈ పరాజయంతో పాకిస్థాన్ సెమీఫైనల్ దారులు దాదాపుగా మూసుకుపోగా.. షంసీకి ‘మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు దక్కింది.
అద్భుతం జరిగినా కష్టమే!
‘మేం అద్భుతాలను నమ్ముతాం.. వన్డే ప్రపంచకప్లో అవి జరుగుతాయని ఆశిస్తున్నాం’ ఇది కీలక మ్యాచ్కు ముందు పాకిస్థాన్ వైస్ కెప్టెన్ షాదాబ్ ఖాన్ చేసిన వ్యాఖ్య. ఇప్పుడు నిజంగానే ఆ జట్టుకు ఇలాంటి అద్భుతం అవసరం పడనుంది. ఇప్పటి వరకు టోర్నీలో ఆడిన ఆరు మ్యాచ్ల్లో నాలుగింట ఓడి 4 పాయింట్లతో పట్టికలో ఆరో స్థానంలో ఉన్న పాకిస్థాన్ సెమీఫైనల్ చేరాలంటే.. ఆ కరిష్మా తప్పనిసరి. హైదరాబాద్లోని ఉప్పల్ స్టేడియంలోనే తమ ప్రపంచకప్ వేట ప్రారంభించిన పాకిస్థాన్.. తొలి రెండు మ్యాచ్ల్లో నెదర్లాండ్స్, శ్రీలంకపై అలవోక విజయాలతో ఫేవరెట్గా కనిపించింది. కానీ అహ్మదాబాద్ వేదికగా టీమ్ఇండియాతో మ్యాచ్ తర్వాత ఆ జట్టు పరిస్థితి గాలి తీసిన బెలూన్లా మారింది. భారత్, ఆస్ట్రేలియా, అఫ్గానిస్థాన్, దక్షిణాఫ్రికా ఇలా వరుసగా నాలుగో పరాజయం మూటగట్టుకున్న పాకిస్థాన్ ఇకపై టోర్నీలో ముందంజ వేయడం దాదాపు అసాధ్యమే. రానున్న మూడు మ్యాచ్ల్లో బంగ్లాదేశ్, న్యూజిలాండ్, ఇంగ్లండ్తో తలపడనున్న పాక్.. ఆ మూడింట భారీ తేడాతో విజయాలు సాధించడంతో పాటు మరోవైపు ప్రస్తుతం పాయింట్ల పట్టికలో నాలుగో స్థానంలో ఉన్న ఆస్ట్రేలియా చిన్న ప్రత్యర్థుల చేతిలో సైతం ఓడాలని కోరుకోక తప్పని పరిస్థితి. ఇవన్నీ జరగడం అసాధ్యం కావడంతో.. ప్రస్తుతానికి పాకిస్థాన్ కేవలం అధికారికంగా మాత్రమే పోటీలో ఉన్నట్లు. భారత్తో పెట్టుకుంటే.. జట్టు భవితవ్యమే మారిపోతుందని ఆ దేశ మాజీలు సూచించినట్లే.. ఈ మెగాటోర్నీతో పాకిస్థాన్ జట్టులో పెను మార్పులు సంభవించనున్నాయి. బాబర్ ఆజమ్ కెప్టెన్సీ ఊడటం ఖాయంగా కనిపిస్తున్నది.వన్డే ప్రపంచకప్లో వరుసగా నాలుగు మ్యాచ్ల్లో ఓడటం పాకిస్థాన్కు ఇదే తొలిసారి.
సంక్షిప్త స్కోర్లు
పాకిస్థాన్: 46.4 ఓవర్లలో 270 ఆలౌట్ (షకీల్ 52, బాబర్ 50; షంసీ 4/60, జాన్సెన్ 3/43),
దక్షిణాఫ్రికా: 47.2 ఓవర్లలో 271/9 (మార్క్మ్ 91; షాహీన్ 3/45, ఉసామా 2/45).