ఇటీవల ఆస్ట్రేలియాపై టీ20 సిరీస్ నెగ్గిన భారత జట్టు.. దక్షిణాఫ్రికా పర్యటనను పరాజయంతో ప్రారంభించింది. వర్షం కారణంగా డక్వర్త్ లూయిస్ పద్ధతిలో ఫలితం తేలిన పోరులో సఫారీ టీమ్ పైచేయి సాధించింది. బ్యాటింగ్లో రింకూసింగ్, సూర్యకుమార్ హాఫ్సెంచరీలతో మంచి స్కోరు చేసినా.. వరణుడి కారణంగా లక్ష్యాన్ని మార్చడంతో దక్షిణాఫ్రికాకు అదనపు ప్రయోజనం చేకూరింది! మన బౌలర్లు ప్రయత్నించినా.. సఫారీ హిట్టర్లను అడ్డుకోలేకపోవడంతో టీమ్ఇండియాకు పరాజయం తప్పలేదు!
పోర్ట్ ఎలిజబెత్: వర్షం అంతరాయం మధ్య సాగిన పోరులో దక్షిణాఫ్రికా దుమ్మురేపింది. మూడు మ్యాచ్ల టీ20 సిరీస్లో తొలి పోరు వర్షం కారణంగా ఒక్క బంతి కూడా పడకుండానే రద్దు కాగా.. రెండో మ్యాచ్కూ వరణుడు అడ్డుపడ్డాడు. మంగళవారం డక్వర్త్ లూయిస్ పద్ధతిలో ముగిసిన రెండో టీ20లో దక్షిణాఫ్రికా 5 వికెట్ల తేడాతో భారత్పై విజయం సాధించింది. టాస్ ఓడి మొదట బ్యాటింగ్కు దిగిన భారత్ 19.3 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 180 పరుగులు చేసింది. రింకూసింగ్ (39 బంతుల్లో 68 నాటౌట్; 9 ఫోర్లు, 2 సిక్సర్లు), సూర్యకుమార్ యాదవ్ (36 బంతుల్లో 56; 5 ఫోర్లు, 3 సిక్సర్లు) హాఫ్సెంచరీలు చేయగా.. హైదరాబాదీ కుర్రాడు తిలక్ వర్మ (29; 4 ఫోర్లు, ఒక సిక్సర్) పర్వాలేదనిపించాడు.
ఓపెనర్లు యశస్వి జైస్వాల్ (0), శుభ్మన్ గిల్ (0) సున్నాలు చుట్టగా.. జితేశ్ శర్మ (1) ప్రభావం చూపలేకపోయాడు. దక్షిణాఫ్రికా బౌలర్లలో కొట్జీ 3 వికెట్లు పడగొట్టాడు. భారత ఇన్నింగ్స్లో మరో మూడు బంతులు మిగిలుండగా.. వర్షం అంతరాయం కలిగించడంతో.. డకవర్త్ లూయిస్ ప్రకారం దక్షిణాఫ్రికా లక్ష్యాన్ని 15 ఓవర్లలో 152గా నిర్ణయించారు. ఛేదనలో సఫారీ జట్టు 13.5 ఓవర్లలో 5 వికెట్లకు 154 పరుగులు చేసింది. రిజా హెన్రిక్స్ (27 బంతుల్లో 49; 8 ఫోర్లు, ఒక సిక్సర్), మార్క్మ్ (30; 4 ఫోర్లు, ఒక సిక్సర్) రాణించారు. భారత బౌలర్లలో ముఖేశ్ రెండు, సిరాజ్, కుల్దీప్ చెరో వికెట్ పడగొట్టారు. ఇరు జట్ల మధ్య గురువారం జొహన్నెస్బర్గ్లో చివరి టీ20 జరగనుంది.
ఈ మ్యాచ్ ద్వారా నయా ఫినిషర్ రింకూసింగ్ అంతర్జాతీయ టీ20ల్లో తొలి అర్ధశతకం నమోదు చేసుకున్నాడు. టాపార్డర్ తడబడటంతో.. పవర్ప్లేలోనే క్రీజులోకి వచ్చిన రింకూ.. ఎదుర్కొన్న తొలి బంతినే బౌండ్రీకి తరలించి తన ఉద్దేశం చాటాడు. అయితే.. మరో ఎండ్ నుంచి సూర్యకుమార్ ధాటిగా ఆడుతుండటంతో తొలుత స్ట్రయిక్ రొటేషన్కే పరిమితమైన రింకూ.. ఆ తర్వాత భారీ షాట్లతో విరుచుకుపడ్డాడు. ఈ క్రమంలో ఫిఫ్టీ మార్క్ అందుకున్న రింకూ.. మార్క్మ్ వేసిన 19వ ఓవర్లో వరుస బంతుల్లో రెండు సిక్సర్లు బాదాడు. అందులో చివరి సిక్సర్ దెబ్బకు స్టేడియం మీడియా గ్యాలరీ అద్దం బద్దలవడం కొసమెరుపు.
భారత్: 19.3 ఓవర్లలో 180/7 (రింకూసింగ్ 68 నాటౌట్; సూర్యకుమార్ 56; కొట్జీ 3/32),
దక్షిణాఫ్రికా: 13.5 ఓవర్లలో 154/5 (లక్ష్యం: 15 ఓవర్లలో 152) (హెన్రిక్స్ 49, మార్క్మ్ 30; ముఖేశ్ 2/34).