బౌలింగ్, బ్యాటింగ్, ఫీల్డింగ్.. ఇలా అన్నీ విభాగాల్లో విఫలమైన టీమ్ఇండియా వరుసగా రెండో టీ20లో ఓటమి పాలైంది. గత మ్యాచ్లో భారీ స్కోరును కాపాడుకోలేకపోయిన భారత్.. ఈసారి దక్షిణాఫ్రికా బౌలర్ల ధాటికి తక్కువ స్కోరుకే పరిమితమైంది. శ్రేయస్, ఇషాన్, కార్తీక్ కాస్త పోరాడారు. అనంతరం బౌలింగ్లో భువనేశ్వర్ విజృంభించినా.. తక్కినవాళ్లు సహకరించకపోవడంతో పంత్ సేనకు పరాజయం తప్పలేదు.
కటక్: గత మ్యాచ్లో బౌలింగ్ వైఫల్యంతో మూల్యం చెల్లించుకున్న టీమ్ఇండియా.. పేలవ ప్రదర్శనతో రెండో టీ20లోనూ పరాజయం పాలైంది. ఐదు మ్యాచ్ల సిరీస్లో భాగంగా ఆదివారం దక్షిణాఫ్రికాతో జరిగిన రెండో పోరులో టీమ్ఇండియా 4 వికెట్ల తేడాతో ఓడింది. సీనియర్ల గైర్హాజరీలో యువ ఆటగాళ్లతో కూడిన జట్టు.. ఏమాత్రం ప్రభావం చూపలేకపోయింది. మొదట బ్యాటింగ్లో తేలిపోయి.. ఓ మోస్తరు స్కోరుకే పరిమితమైన పంత్ సేన.. ఆనక బౌలింగ్లోనూ మ్యాజిక్ కనబర్చలేకపోయింది.
టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 148 పరుగులు చేసింది. శ్రేయస్ అయ్యర్ (40; 2 ఫోర్లు, 2 సిక్సర్లు), ఇషాన్ కిషన్ (34; 2 ఫోర్లు, 3 సిక్సర్లు), దినేశ్ కార్తీక్ (30 నాటౌట్; 2 ఫోర్లు, 2 సిక్సర్లు) రాణించారు. రుతురాజ్ గైక్వాడ్ (1), కెప్టెన్ రిషబ్ పంత్ (5), స్టార్ ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యా (9) విఫలమయ్యారు. సఫారీ బౌలర్లలో నోర్జే రెండు వికెట్లు పడగొట్టాడు. అనంతరం లక్ష్యఛేదనలో దక్షిణాఫ్రికా 18.2 ఓవర్లలో 6 వికెట్లకు 149 పరుగులు చేసింది. వికెట్ కీపర్ బ్యాటర్ హెన్రిచ్ క్లాసెన్ (46 బంతుల్లో 81; 7 ఫోర్లు, 5 సిక్సర్లు) దంచికొట్టగా.. కెప్టెన్ టెంబా బవుమా (35) ఫర్వాలేదనిపించాడు. భారత బౌలర్లలో భువనేశ్వర్ కుమార్ 4 వికెట్లు పడగొట్టాడు. క్లాసెన్కు ‘మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్’అవార్డు దక్కింది. ఇరు జట్ల మధ్య మంగళవారం విశాఖపట్నంలో మూడో వన్డే జరుగనుంది.
సమిష్టి వైఫల్యం..
వరుసగా రెండో మ్యాచ్లోనూ టాస్ ఓడి మొదట బ్యాటింగ్కు దిగిన టీమ్ఇండియాకు శుభారంభం దక్కలేదు. రుతురాజ్ గైక్వాడ్ తొలి ఓవర్ ఐదో బంతికే ఔటయ్యాడు. అయితే మరో ఓపెనర్ ఇషాన్ కిషన్ గత మ్యాచ్ ఫామ్ను కొనసాగించడంతో భారత్కు పెద్దగా ఇబ్బంది లేకుండా పోయింది. పవర్ ప్లే ముగిసేసరికి పంత్ సేన 42/1తో నిలిచింది. ఆ తర్వాత నోర్జే బౌలింగ్ ఇషాన్ ఔట్ కాగా.. శ్రేయస్ అయ్యర్ నెమ్మదిగా ఆడాడు. కెప్టెన్ పంత్ ఎక్కువసేపు నిలువలేకపోగా.. పార్నెల్ వేసిన చక్కటి బంతికి హార్దిక్ పాండ్యా క్లీన్ బౌల్ట్ అయ్యాడు. వేగం పెంచాల్సిన సమయంలో శ్రేయస్ వెనుదిరగగా.. ఆఖర్లో దినేశ్ కార్తీక్ విలువైన పరుగులు రాబట్టాడు. బౌలింగ్కు సహకరిస్తున్న పిచ్పై సఫారీ బౌలర్లు మధ్య ఓవర్లలో కట్టుదిట్టమైన బంతులతో భారత హిట్టర్లను అడ్డుకున్నారు.
భువీ ఒక్కడే..
బ్యాటింగ్ దళం ఓ మాదిరి స్కోరే చేసినా.. తన అద్భుత బౌలింగ్తో భువనేశ్వర్ కుమార్.. టీమ్ఇండియాకు పోరాడే పరిస్థితి కల్పించాడు. ఇన్నింగ్స్ మొదటి ఓవర్లో హెన్రిక్స్ (4)ను ఔట్ చేసిన భువీ.. మూడో ఓవర్లో ప్రిటోరియస్ (4)ను బుట్టలో వేసుకున్నాడు. ఆరో ఓవర్లో డసెన్ను కూడా (1) వెనక్కి పంపడంతో ఒక దశలో దక్షిణాఫ్రికా 29 పరుగులకే 3 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఈ సమయంలో కెప్టెన్ బవుమాతో కలిసి క్లాసెన్ ఇన్నింగ్స్ను నిర్మించాడు. ఆరంభంలో ఆచితూచి ఆడిన ఈ జోడీ.. కుదురుకున్నాక భారీ షాట్లతో విరుచుకుపడటంతో మ్యాచ్ సఫారీలవైపు మొగ్గు చూసింది. ఆఖర్లో మరోసారి బౌలింగ్కు వచ్చిన భువీ పార్నెల్ (1) వికెట్ ఖాతాలో వేసుకున్నా అప్పటికే నష్టం జరిగపోయింది.
సంక్షిప్త స్కోర్లు
భారత్: 20 ఓవర్లలో 148/6 (శ్రేయస్ 40, ఇషాన్ 34; నోర్జే 2/36), దక్షిణాఫ్రికా: 18.2 ఓవర్లలో 149/6 (క్లాసెన్ 81, బవుమా 35; భువనేశ్వర్ 4/13).