కోల్కతా : బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీకి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. ఈ మేరకు బీసీసీఐ వర్గాలు అధికారికంగా వెల్లడించాయి. కొవిడ్ నిర్ధారణతో గంగూలీ.. కోల్కతాలోని వుడ్లాండ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నట్లు పేర్కొన్నారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. కరోనా లక్షణాలు స్వల్పంగా ఉండటంతో నిన్న గంగూలీ ఆర్టీపీసీఆర్ టెస్టు చేయించుకున్నారు. ఇటీవల గంగూలీని కలిసిన వారంతా కొవిడ్ టెస్టులు చేయించుకోవాలని, జాగ్రత్తలు పాటించాలని సూచించారు.
ఈ ఏడాది జనవరిలో గంగూలీ గుండెపోటుకు గురైన విషయం తెలిసిందే. దీంతో యాంజియోప్లాస్టీ శస్త్రచికిత్స చేయించుకున్నారు. ఈ ఏడాది గంగూలీ ఆస్పత్రి పాలు కావడం ఇది మూడోసారి. ఈ ఏడాది జనవరిలో ఛాతీలో నొప్పి రావడంతో ఆస్పత్రిలో చేరి చికిత్స పొందారు. 20 రోజుల తర్వాత గుండెపోటు కారణంగా అదే నెలలో ఆస్పత్రిలో అడ్మిట్ అయి యాంజియోప్లాస్టీ చికిత్స చేయించుకున్నారు. రక్తనాళాలు బ్లాక్ కావడంతో రెండు స్టెంట్లు కూడా వేయించుకున్నారు. ఈ ఏడాది మార్చిలో కరోనా వ్యాక్సిన్ కూడా తీసుకున్నారు. గతంలో గంగూలీ సోదరుడు, తల్లి కూడా కరోనా బారిన పడి కోలుకున్నారు.