ఇంగ్లండ్ పర్యటనలో భాగంగా రీషెడ్యూల్డ్ టెస్టులో ఓడి సిరీస్ ను 2-2 తో కోల్పోయినా పరిమిత ఓవర్ల ఫార్మాట్ లో మాత్రం టీ20లతో పాటు వన్డే సిరీస్ ను కూడా గెలుచుకుంది టీమిండియా. దీంతో భారత జట్టుపై ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. తాజాగా భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ భారత జట్టుకు ప్రత్యేక అభినందనలు తెలిపాడు.
ట్విటర్ వేదికగా గంగూలీ స్పందిస్తూ… ‘ఇంగ్లండ్ లో అద్భుత ప్రదర్శన. వాళ్ల దేశంలో ఇంగ్లండ్ ను ఓడించడం అంత ఈజీ కాదు. టెస్టులలో 2-2 తో సిరీస్ సమం చేసి టీ20, వన్డేలలో సిరీస్ నెగ్గడం గొప్ప విషయం. వెల్ డన్ ద్రావిడ్, రోహిత్ శర్మ, రవిశాస్త్రి (గతేడాది నాలుగు టెస్టులకు శాస్త్రినే హెడ్ కోచ్), విరాట్ కోహ్లీ. పంత్ చాలా స్పెషల్..’అని ట్వీట్ చేశాడు.
ఇంగ్లండ్ తో మాంచెస్టర్ వేదికగా ముగిసిన మూడో వన్డేలో ఇంగ్లండ్ తొలుత బ్యాటింగ్ చేసి 45.5 ఓవర్లలో 259 పరుగులుకు ఆలౌట్ అయింది. జోస్ బట్లర్ (60) టాప్ స్కోరర్. అనంతరం భారత జట్టు 42.1 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 261 పరుగులు చేసింది. రిషభ్ పంత్ (125 నాటౌట్) వన్డేలలో తొలి సెంచరీ చేసి టీమిండియాకు చిరస్మరణీయ విజయాన్ని అందించాడు. ఈ విజయంతో భారత్ సిరీస్ ను 2-1 తో గెలిచింది. అంతకుముందు టీ20లలో కూడా 2-1తో సిరీస్ ను నెగ్గిన విషయం విదితమే.
Super performance in england ..not easy in their country ..2-2 test .win in T20 and one days..well done dravid ,rohit sharma,ravi shastri,virat kohli @bcci ..pant just special..so is pandu ..
— Sourav Ganguly (@SGanguly99) July 17, 2022