ఢిల్లీ: వచ్చే జూలైలో శ్రీలంకలో టీమ్ఇండియా పర్యటన ఉంటుందని బీసీసీఐ స్పష్టం చేసింది.
శ్రీలంక పర్యటనలో కోహ్లీసేన మూడు వన్డేలు, ఐదు టీ20లు ఆడేలా ఇప్పటికే షెడ్యూల్ ఖరారైందని బీసీసీఐ అధ్యక్షుడు సౌరభ్ గంగూలీ తెలిపాడు. భారత్, శ్రీలంక మధ్య సిరీస్ జూలై 2021లో జరగనుండటంతో ఇప్పట్లో ఐపీఎల్లోని మిగతా మ్యాచ్ల నిర్వహణ అనుమానంగా మారింది.
‘మూడు వన్డేలు, ఐదు టీ20ల సిరీస్ కోసం టీమ్ఇండియా..శ్రీలంకకు వెళ్లాల్సి ఉంది. 14 రోజుల క్వారంటైన్ వంటి అంశాలను పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంది. క్వారంటైన్ను నిర్వహించడం చాలా కష్టం. ఐపీఎల్లోని మిగతా మ్యాచ్లను పూర్తి చేయడంపై ఇప్పుడే చెప్పడం తొందరపాటే అవుతుందని’ గంగూలీ పేర్కొన్నారు.