South Africa Tour : దక్షిణాఫ్రికా పర్యటనను విజయంతో ఆరంభించాలని భావిస్తున్న భారత జట్టు(Team India) టీ20 సిరీస్కు సిద్ధమైంది. సూర్యకుమార్ యాదవ్(Surya kumar Yadav) నేతృత్వంలో కుర్రాళ్లతో కూడిన టీమిండియా ఈరోజు సఫారీలతో అమీతుమీ తేల్చుకోనుంది. అయితే.. వన్డే వరల్డ్ కప్(ODI World Cup) అనంతరం లండన్ పర్యటనలో సేదతీరిన భారత యువ ఓపెనర్ శుభ్మన్ గిల్(Shubman Gill) జట్టుతో కలవడంతో.. ఓపెనర్గా ఎవరిని ఆడించాలి? అని కోచ్ రాహుల్ ద్రవిడ్, కెప్టెన్ సూర్య తలపట్టుకుంటున్నారు.
డర్బన్లో ఆదివారం జరిగే తొలి టీ20 కోసం గిల్ను తుదిజట్టులోకి తీసుకుంటే.. జోరుమీదున్న యశస్వీ జైస్వాల్(Yashasvi Jaiswal), రుతురాజ్ గైక్వాడ్(Ruturaj Gaikwad)లలో ఒకరిని పక్కన పెట్టాల్సిన పరిస్థితి. ఆస్ట్రేలియాతో స్వదేశంలో ముగిసిన ఐదు టీ20 సిరీస్లో యశస్వీ, రుతురాజ్ జోడీ సూపర్ హిట్ అయింది.
యశస్వీ జైస్వాల్
కంగారూ బౌలర్లను సమర్థంగా ఎదుర్కొన్న ఈ ఇద్దరూ భారత్కు శుభారంభాలు ఇచ్చారు. రుతురాజ్ అయితే.. ఒక సెంచరీతో కలిపి 223 రన్స్ కొట్టాడు. మరోవైపు బాదుడే పరమావధిగా పెట్టుకున్న యశస్వీ 170 స్ట్రైక్ రేటుతో 135 రన్స్ సాధించాడు.ఐపీఎల్ 16వ సీజన్ తర్వాత జరిగిన 19వ ఆసియా క్రీడల్లో యశస్వీ, రుతురాజ్ రఫ్ఫాడించారు. తొలి మ్యాచ్లో నేపాల్పై యశస్వీ సెంచరీతో విరుచుకుపడ్డాడు.
రుతురాజ్ గైక్వాడ్
ఐపీఎల్ 16వ సీజన్లో గుజరాత్ టైటాన్స్(Gujarat Titans) తరఫున దంచికొట్టిన గిల్.. వరల్డ్ కప్లో తేలిపోయాడు. డెంగీ కారణంగా మూడు మ్యాచ్లకు దూరమైన ఈ యంగ్స్టర్ .. ఆ తర్వాత కోలుకొని జట్టులోకి వచ్చినా తనదైన ముద్ర వేయలేకపోయాడు. కీలకమైన ఫైనల్లో 4 పరుగులతో నిరాశపరిచాడు. ప్రపంచ కప్ తర్వాత బ్రేక్ తీసుకున్న అతడు నేరుగా టీ20 సిరీస్లో బరిలోకి దిగుతున్నాడు. ఈ పరిస్థితుల్లో అటాకింగ్ గేమ్తో బౌలర్లపై ఒత్తిడి పెంచే యశస్వీ, క్లాస్ ఆటతో స్కోర్ బోర్డును పరుగులు పెట్టించే రుతురాజ్లను కాదని గిల్కు చాన్స్ ఇస్తారా? అనేది తెలియాల్సి ఉంది.