Shubman Gill : సొంతగడ్డపై వరల్డ్ కప్ ఫైనల్లో(ODI World Cup Final 2023) ఆస్ట్రేలియా చేతిలో ఓటమిని భారత జట్టు(Team India) సభ్యులు జీర్ణించుకోలేకపోతున్నారు. మ్యాచ్ చేజారిన వేళ మైదానంలోనే కన్నీటిపర్యంతమైన టీమిండియా ప్లేయర్లు.. ఆ బాధ నుంచి తేరుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. కానీ, వాళ్ల వల్ల కావడం లేదు. తాజాగా ఓపెనర్ శుభ్మన్ గిల్(Shubman Gill) ఇన్స్టాగ్రామ్ వేదికగా తన ఆవేదనను వ్యక్తం చేశాడు.
’16 గంటలు గడిచిపోయింది. కానీ, గత రాత్రి కలిగిన బాధ గుండెల్ని పిండేస్తోంది. కొన్నిసార్లు మనం సర్వశక్తులు ఒడ్డినా సరిపోదు. మా ఆఖరి గోల్ అయిన వరల్డ్ కప్ సాధనలో చివరి మెట్టుపై తడబడ్డాం. టీమిండియా నిబద్దతకు ఈ ప్రయాణం నిదర్శనం. గెలుపు ఓటముల్లో వెన్నంటి ఉంటున్న అభిమానులే మా ప్రపంచం. ఇక్కడితే ముగింపు పడలేదు. మేము గెలిచేంత వరకు పోరాటం ఆగదు’ అని గిల్ రాసుకొచ్చాడు.
అహ్మదాబాద్లో జరిగిన ఫైనల్లో ఆస్ట్రేలియా 6 వికెట్ల తేడాతో భారత్ను ఓడించింది. టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన భారత్కు శుభారంభం దక్కింది. కానీ, తనకు అచ్చొచ్చిన పిచ్పై శుభ్మన్ గిల్(4) స్టార్క్ బౌలింగ్లో ఆడం జంపాకు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. ఇదే పిచ్పై న్యూజిలాండ్పై సెంచరీ, ఐపీఎల్ 16వ సీజన్లో రెండు సెంచరీలు బాదిన గిల్ చెత్త షాట్తో వికెట్ పారేసుకున్నాడు.
శుభ్మన్ గిల్
అనంతరం రోహిత్ శర్మ(47), కోహ్లీ(56).. ఇలా వరుసగా ప్రధాన వికెట్లు తీసి ఆసీస్ పైచేయి సాధించింది. టీమిండియా నిర్దేశించిన 240 పరుగుల లక్ష్యాన్ని ఆసీస్ 43 ఓవర్లలో ఛేదించింది. ట్రావిస్ హెడ్(137) సెంచరీతో కదం తొక్కగా.. లబూషేన్(58 నాటౌట్) కీలక ఇన్నింగ్స్ ఆడి కంగారూ జట్టును విజయతీరాలకు చేర్చారు.