సౌతాఫ్రికాతో జరిగిన రెండో వన్డేలో సెంచరీ బాదిన యువప్లేయర్ శ్రేయాస్ అయ్యర్పై ప్రశంసల వర్షం కురుస్తోంది. ఈ క్రమంలోనే టీమిండియా మాజీ ఓపెనర్, లెజెండరీ ప్లేయర్ వసీం జాఫర్ కూడా అయ్యర్ ఆటతీరును కొనియాడాడు. శ్రేయాస్ ఆడిన గత ఆరు వన్డే ఇన్నింగ్సుల్లో నాలుగు హాఫ్ సెంచరీలు, ఒక సెంచరీ బాదడం గమనార్హం.
ఇంత అద్భుతమైన ఫామ్లో ఉన్న అయ్యర్ను వచ్చే వన్డే ప్రపంచకప్ జట్టులో ఎంపిక చేసినా ఆశ్చర్యం లేదని జాఫర్ చెప్పాడు. ‘శ్రేయాస్ అదరగొడుతున్నాడు. 2023 వన్డే ప్రపంచకప్ ఆడే జట్టులో ఏదో ఒక స్థానాన్ని అయ్యర్ పట్టేయొచ్చు’ అని జాఫర్ అభిప్రాయపడ్డాడు. సౌతాఫ్రికాతో జరిగిన రెండో వన్డేలో 113 పరుగులతో అజేయంగా నిలిచిన అయ్యర్.. భారత జట్టును విజయతీరాలకు చేర్చాడు. రాంచీ వేదికగా జరిగిన ఈ మ్యాచ్లో యువ ఓపెనర్ ఇషాన్ కిషన్ (93) కూడా రాణించాడు.