ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) ద్వారా భారత క్రికెట్ రూపురేఖలను మార్చిన ఘనత లలిత్ మోడీదే అని చెప్పకతప్పదు. 2008లో ఈ లీగ్ కు కర్త, కర్మ, క్రియ అయి వ్యవహరించిన మోడీ.. తర్వాత వెలుగుచూసిన అవినీతి ఆరోపణలతో దేశం విడిచి లండన్లో జీవిస్తున్నాడు. ఇటీవలే ముగిసిన ఐపీఎల్ వేలం తర్వాత మోడీ తరుచూ వార్తల్లో నిలుస్తున్నాడు.
నాలుగు రోజుల క్రితం బాలీవుడ్ నటి సుస్మితా సేన్ తో కలిసి అతడు పంచుకున్న ఫోటోలు సంచలనం రేపాయి. అయితే ఆ ఫోటోల తర్వాత తనపై వచ్చిన ట్రోల్స్ పై లలిత్ మోడీ తాజాగా తన ఇన్స్టాలో సుదీర్ఘ వివరణ ఇస్తూ సంచలన కామెంట్స్ చేశాడు.
‘ఈ మీడియా నన్నెందుకు ప్రతిసారి ట్యాగ్ చేస్తూ ట్రోల్ చేస్తున్నది. మనమింకా మధ్యయుగ కాలంలో ఉన్నామా..? ఇద్దరు వ్యక్తులు స్నేహితులుగా ఉండొద్దా..? ఒకవేళ వాళ్లిద్దరి మధ్య కెమిస్ట్రీ కుదిరి కాలం కలిసొస్తే అద్భుతం జరుగుతుంది కదా..’ అని సుస్మితా సేన్ తో కలిసి ఉన్న ఫోటోలను షేర్ చేస్తూ తనను ట్రోల్ చేసేవారికి కౌంటరిచ్చాడు.
దేశానికి నాకంటే మంచి చేసినోడెవడు..?
ఇక తనను ఆర్థిక నేరగాడు అన్న ఆరోపణలపై మోడీ సుదీర్ఘ వివరణ ఇచ్చుకున్నాడు. తానేమీ బికారిని కాదని.. పుట్టుకతోనే డైమండ్ స్పూన్ తో జన్మించానని.. ఐపీఎల్ కు కారణమే తానని రాసుకొచ్చాడు. ‘మన అందమైన దేశంలో నాకంటే మంచి చేసినోడిని మరొకడిని చూపించండి. దేశానికి నేను దానిని బహుమతి (ఐపీఎల్ ను ఉద్దేశిస్తూ)గా ఇచ్చాను.
ఇండియాలో వ్యాపారం ఎంత కష్టతరమో మీ అందరికీ తెలుసు. నేను 2008 లో ఐపీఎల్ అంటే అందరూ నవ్వారు. అప్పుడు మాంద్యం ప్రపంచాన్ని ముంచెత్తుతున్నది. ఇప్పుడు చూడండి. అది (ఐపీఎల్) ఎక్కడ ఉందో..? ఎవరు నవ్వుతున్నారు ఇప్పుడు..? ఐపీఎల్ ను ఎవరు సృష్టించారో ప్రపంచానికంతటికీ తెలుసు.
బీసీసీఐలో కూర్చున్న ఒక్కరైనా (సభ్యులను కోతితో పోల్చాడు) ఒక్క మంచిపనైనా చేశారా..? ఇదంతా నేను సృష్టించిన సంపద. నేను సృష్టించిన గేమ్ వల్లే ఇవాళ దేశం సమైక్యంగా ఉంటున్నది. ప్రతి మ్యాచ్ ను సంతోషంగా వీక్షిస్తున్నది. నన్నందరూ ఆర్థిక నేరగాడు అంటున్నారు. కాదు. నేను పుట్టుకతోనే ధనవంతుడిని. నేను రాయ్ బహదూర్ గుజర్మల్ మోడీ చిన్న మనవడిని. నేను డబ్బును సృష్టించాను. తీసుకుని పారిపోలేదు. ప్రజల సొమ్మును ముట్టలేదు. ప్రభుత్వాలకు అనుకూలంగా ఎప్పుడూ లేను’ అని పేర్కొన్నాడు.
కొద్దిగా కళ్లు తెరవండి…
తాను ఉపాధ్యక్షుడి (2005 నవంబర్ 29న)గా చేరినప్పుడు బీసీసీఐ బ్యాంకులో ఉన్న నగదు రూ. 40 కోట్లని కానీ దానిని తాను ఎన్నో రెట్లు పెంచానని మోడీ స్పష్టం చేశాడు. ‘కళ్లు తెరవండి. నేను బీసీసీఐ లో జాయిన్ అయ్యేనాటికి దాని బ్యాంక్ ఖాతాలో ఉన్న నగదు రూ. 40 కోట్లు. నాపై నిషేధం (2010) విధించే సమయానికి బీసీసీఐ బ్యాంక్ బ్యాలెన్స్ ఎంతో తెలుసా..? రూ. 47,680 కోట్లు. మరి వారి (బీసీసీఐ) లో ఒక్కరైనా నాకు సాయం చేశారా..?’ అని ప్రశ్నించాడు.
మీడియాపై విసుర్లు..
‘వాళ్లకు ఎక్కడ ప్రారంభించాలో తెలియడం లేదు. ఫేక్ మీడియా మిమ్మల్ని చూస్తే సిగ్గుగా ఉంది. మీరు హీరోల్లాగా నటించకండి’ అని లలిత్ మోడీ చురకలేశాడు.