Virat Kohli : సొంత గడ్డపై జరిగిన వన్డే వరల్డ్ కప్(ODI World Cup 2023)లో పరుగుల వరద పారించిన విరాట్ కోహ్లీ(Virat Kohli) రికార్డులు తిరగరాశాడు. వన్డేల్లో 50వ సెంచరీతో క్రికెట్ లెజెండ్ సచిన్ టెండూల్కర్(Sachin Tendulkar) రికార్డు బద్ధలు కొట్టిన విరాట్ సోమవారం కోట్లాదిమంది అభిమానులను షాక్కు గురి చేశాడు. ఈ స్టార్ బ్యాటర్ ముఖంపై గాయాలు, ముక్కుపై బ్యాండేజి ఉన్న ఫొటోను తన ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేశాడు.
అందులో కోహ్లీ తెలుపు రంగు టీ షర్ట్ వేసుకున్నాడు. ఎడమ కన్ను నల్లగా కమిలిపోయి ఉంది. కుడి చెంప, ఎడమవైపు నుదురు భాగంలో చిన్న గాటులాంటి గాయం ఉంది. ఆ పోస్ట్ చూసిన ఫ్యాన్స్ ‘అయ్యో.. విరాట్ కోహ్లీకి ఏమైంది’ అని కంగారుపడ్డారు. క్షణాల్లో ఆ ఫోస్ట్ సోషల్మీడియాలో వైరల్ అయింది.
What’s Virat Kohli upto?
King Kohli latest Instagram story. pic.twitter.com/EE6C00FuyU— Mufa (@MufaKohlii) November 27, 2023
అయితే.. ఆ ఫొటోకు రన్ మెషీన్ మీరు మరొక వ్యక్తిని చూస్తారు అని క్యాప్షన్ రాశాడు. అంతేకాదు ఆ ఫొటోలో కోహ్లీ నవ్వుతూ విజయ సంకేతం చూపిస్తున్నాడు. దాంతో అంతా ఒక్కసారి ఊపిరి పీల్చుకున్నారు. వరల్డ్ కప్లో కోహ్లీ రెండు సెంచరీలతో కలిపి 765 రన్స్ కొట్టాడు. అత్యధిక పరుగుల వీరుడిగా నిలిచి.. ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్ అవార్డు అందుకున్నాడు.
ఐపీఎల్ 17వ సీజన్కు రాయల్ చాలెంజర్స్ బెంగళూరు(Royal Challengers Bangalore) కోహ్లీని అట్టిపెట్టుకుంది. ఆ మరుసటి రోజే అంటే.. నవంబర్ 27న కోహ్లీ ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ పెట్టాడు. పదహారో సీజన్లో కోహ్లీ విధ్వంసక ఇన్నింగ్స్లతో అలరించాడు. వరుసగా రెండు శతకాలతో చెలరేగిన విరాట్ ఆర్సీబీని ప్లే ఆఫ్స్ చేర్చేందుకు ఎంతో కష్టపడ్డాడు. అయితే.. ఆఖరి లీగ్ మ్యాచ్లో కోహ్లీ సెంచరీ బాదినా.. శుభ్మన్ గిల్ సెంచరీ కొట్టడంతో బెంగళూరు ఇంటిదారి పట్టింది. 15 సీజన్లలో రెండు సార్లు ఫైనల్ చేరిన ఆర్సీబీ ఒక్కసారి కూడా చాంపియన్గా నిలవలేకపోయింది. 16వ సీజన్లో అయితే.. బ్యాటింగ్ భారమంతా డూప్లెసిస్, మ్యాక్స్వెల్, కోహ్లీనే మోశారు. మిగతావాళ్లు కనీసం 20 -30 పరుగులు చేయకపోవడం ఆర్సీబీ అవకాశాల్ని దెబ్బతీసింది.