CM సీఎం కేసీఆర్ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు తెలంగాణ సమాజంలో దశాబ్దాలుగా గూడు కట్టుకుపోయిన మూస భావన, వివక్షతను తరిమివేస్తున్నాయి. సామాజిక మార్పునకు అవసరమయ్యేది నినాదాలు కాదని, కార్యాచరణ, సంకల్పం కావాలనే సత్యాన్ని చాటుతున్నాయి. అట్టడుగువర్గాల్లో ఆనంద జ్యోతులు, విజ్ఞాన కాంతులను వెలిగిస్తూ సామాజిక చైతన్యం దిశగా నడిచేందుకు ఊతమిస్తున్నాయి. యావత్ దేశానికి ప్రగతి పాఠాలను బోధిస్తున్నాయి.
పేదరిక నిర్మూలన
75 ఏండ్ల స్వతంత్ర భారతంలో, ఇప్పటికీ దేశవ్యాప్తంగా పేదరికం నానాటికీ పెరిగిపోతున్నది. ముఖ్యంగా గ్రామీణ పేదరికం. అది ప్రత్యక్షంగా, పరోక్షంగా పట్టణాలకు అంతర్గత వలసలు, పట్టణ పేదరికాన్ని కూడా రెట్టింపు చేస్తున్నది. అన్ని రాష్ర్టాల్లోనూ, స్వతంత్ర భారత పాలకులు పేదరిక నిర్మూలనకు తీసుకున్న చర్యలు మాత్రం అంతంత మాత్రమే. పేదరికానికి ముఖ్య కారణం ఉపాధి అవకాశాలు లేకపోవడమే. వ్యవసాయాభివృద్ధి కార్యక్రమాల కొరత ప్రధాన కారణం. సీఎం కేసీఆర్ చేపట్టిన కార్యక్రమాలు పేదరిక నిర్మూలనకు బాటలు వేస్తున్నాయి. వ్యవసాయ రంగ స్థిరీకరణతో వ్యవసాయానుబంధ రంగాలు, కులవృత్తుల ప్రోత్సాహంతో గ్రామీణ ప్రాంతాల్లో ఏడాది పొడవునా ఉపాధి అవకాశాలు, కూలీరేట్లు పెరిగాయి. తాత్కాలిక, అంతర్గత వలసలు తగ్గిపోయాయి. ఆసరా పింఛన్లు, 6 కిలోల బియ్యం పంపిణీతో అట్టడుగువర్గాలు, విధివంచితులకు తిండికి కొరత లేకుండాపోయింది.
అందరికీ విద్య
‘విద్య అనేది సమాజ మార్పునకు మొదటి ఉత్ప్రేరకం. విద్య లేకపోవడం అజ్ఞానానికి దారి తీస్తుంది. అజ్ఞానం ఆర్థికాభివృద్ధిని దెబ్బ తీస్తుంది. ఆర్థిక లేమి సమాజంలో గుర్తింపును మాయం చేస్తుంది’ ఇవీ మహాత్మా జ్యోతిబా ఫూలే, డాక్టర్ బీఆర్ అంబేద్కర్ చెప్పిన మాటలు. అందుకే వారు అట్టడుగు వర్గాల విద్యాభివృద్ధికి అవిశ్రాంతంగా కృషి చేశారు. గత ప్రభుత్వాలు అనేక చట్టాలు చేసినా సాధించిన ఫలితాలు అంతంత మాత్రమే. తెలంగాణలో అక్షరాస్యతా శాతం తక్కువే. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలు, మహిళల పరిస్థితి మరింత దయనీయం. విధివంచితులు, అనాథల సంగతి సరేసరి. ఈ నేపథ్యంలోనే తెలంగాణ ప్రభుత్వం వినూత్న చర్యలు చేపట్టింది. మహనీయులు చూపిన మార్గంలోనే ముందుకు సాగుతున్నది. ఆయా వర్గాలకు వేర్వేరుగా గురుకులాలను ఏర్పాటు చేసింది. అత్యంత వెనుకబడిన, విధివంచిత, అనాథ బాలలకు రిజర్వేషన్లు అమలు చేసి ప్రవేశాలు కల్పించింది. డిగ్రీ వరకు ఉచితంగా ఉన్నత విద్యనందిస్తున్నది. పేదరికాన్ని జయించి, సమాజంలో ఉన్నత హోదా పొందడానికి ప్రోత్సాహాన్ని అందిస్తున్నది.
మహిళా సాధికారత వైపు ఆచరణాత్మక అడుగులు
గత పాలకుల తీరుకు భిన్నంగా రాష్ట్ర సర్కారు ఆడబిడ్డలు అన్నింటా అభివృద్ధి సాధించే పథకాలను అమలు చేస్తూ మహిళా సంక్షేమానికి కొత్త నిర్వచనాన్ని ఇచ్చిందంటే అతిశయోక్తి కాదు. మహిళా ఆర్థిక సాధికారతతో వనరులు, ఆస్తులు, ఆదాయ నియంత్రణకు అవకాశం ఏర్పడింది. కుటుం బ సమస్యలను ధైర్యంగా ఎదుర్కొనే సామర్థ్యాన్ని పెంపొందించింది. మహిళలకు సామాజికంగా, కుటుంబంలో గౌరవాన్ని తెచ్చిపెట్టింది. ఏ పథకమైనా ఆడబిడ్డ పేరిటనే చెక్కులు అందిస్తున్నది. కేసీఆర్ కిట్టు, న్యూట్రిషన్ కిట్టు, అమ్మఒడి పథకాలు మహిళలకు అండగా నిలుస్తున్నాయి. కేజీ టూ పీజీ ఉచిత విద్య కోసం ప్రవేశపెట్టిన గురుకుల విద్యాలయ వ్యవస్థ మహిళా అక్షరాస్యత పెంపులో మైలురాయని చెప్పవచ్చు. దశాబ్దాలుగా దేశ పాలకులు, చట్టాలకు సాధ్యం కాని బాల్యవివాహాల నిర్మూలన కల్యాణలక్ష్మి, షాదీముబారక్తో సాధ్యమవుతున్నది. పరోక్షంగా లింగ వివక్షతను రూపుమాపేందుకు బాటలు వేస్తున్నది. హైజిన్ కిట్లు ఆడబిడ్డల్లో రక్తహీనత సమస్య పరిష్కారానికి, మాతా శిశుమరణాలను తగ్గిస్తున్నాయి. నామినేటెడ్ పోస్టులు, పంచాయతీలు, మున్సిపాలిటీల్లోనూ మహిళలకు సగం స్థానాలను కట్టబెట్టి రాజకీయ అవకాశాలను కల్పిస్తున్నారు. రెసిడెన్షియల్ డిగ్రీ కళాశాలల ఏర్పాటుతో విద్యావకాశాలు మెరుగయ్యాయి. ఉద్యోగ, ఉపాధిలోనూ ప్రభుత్వం మహిళలకు ప్రాధాన్యత ఇస్తున్నది. ఫలితంగా మహిళలు కుటుంబ, రాష్ట్ర అభివృద్ధిలో భాగస్వాములు అవుతున్నారు.
భూస్వామ్య, దళారీ వ్యవస్థకు చెల్లుచీటి
కేసీఆర్ పాలనా విధానాలు తెలంగాణ గ్రామీణ భూస్వామ్య వ్యవస్థ, ఉత్పత్తి సంబంధాల్లో గుణాత్మక, పరిణామాత్మక మార్పులకు దోహదం చేస్తున్నాయి. పల్లెల్లోని ఆధిపత్యశక్తుల పీచమణచి వేస్తున్నాయి. తెలంగాణ గ్రామీణ వ్యవస్థలో కొన్ని వర్గాలదే పూర్తి ఆధిపత్యం. గ్రామంలోని రైతులందరూ వారిపై ప్రత్యక్షంగా, పరోక్షంగా ఆధారపడి, పరాన్న భుక్కులై జీవించాల్సిందే. లాగోడి కావాలంటే పటేల్ ఇంటికి పరుగెత్తుకుపోవాల్సిందే. వెరసి రైతులు, సామాన్య ప్రజానీకం పూర్తిగా పరాధీనతే. నచ్చినా నచ్చకపోయినా ఆధిపత్యశక్తుల చేతిలో కీలుబొమ్మగా బతుకులీడ్వాల్సిన దుస్థితి. ఇప్పుడు ఆ వ్యవస్థ మూలాలనే దెబ్బ తీశారు ముఖ్యమంత్రి కేసీఆర్. రైతుబంధు, రైతుబీమా పథకాలతో, అదునుకు ఎరువులు అందుబాటులో ఉంచడం ద్వారా రైతు స్వతంత్రంగా జీవించే అవకాశాన్ని కల్పించారు. ఇతర పథకాలన్నింటినీ ఆన్లైన్ బెన్ఫిషియరీ మోడ్లో అమలు చేస్తుండడంతో దళారులకు కాకుండా అర్హులైన సామాన్య పేదలకే లబ్ధి చేకూరుతున్నది. దళారీ వ్యవస్థకు ముకుతాడు వేశారు.
దళితక్రాంతి
దేశంలో దళితుల పరిస్థితి ఎట్లా ఉందో చెప్పాల్సిన పనిలేదు. అంటరానితనం, వివక్ష ఇప్పటికీ వెన్నాడుతూనే ఉన్నది. తరతరాల నుంచి కూలీలుగా జీవనం సాగిస్తుండడంతో ఆర్థికంగా ఎదగలేకపోతున్నారు. ఈ దురాచారాలను రూపుమాపేందుకు గత ప్రభుత్వాలు చిత్తశుద్ధితో చేసిన కృషి శూన్యమే. దళితవాడల్లో భోజనాలు చేయడం, కులాంతర వివాహాలకు నామమాత్రంగా ప్రోత్సాహకాలు అందించడం, అరకొరగా రాయితీ రుణాలివ్వడంతో సరిపెట్టాయి తప్ప వారిలో గుణాత్మక, పరిణామాత్మక మార్పులను తీసుకువచ్చేందుకు చేపట్టిన చర్యలేవీ లేవు. సీఎం కేసీఆర్ దళితుల సముద్ధరణ కోసం దళితబంధు పథకానికి రూపకల్పన చేసి అమలు చేస్తున్నారు. సొంత వ్యాపారాలు, తెలిసిన, నచ్చిన ఉపాధి మార్గాన్ని ఎంచుకుని జీవించడానికి నిరుపేద దళిత కుటుంబాలకు ఎలాంటి షరతులు లేకుండా, బ్యాంకు లింకేజీ లేకుండా ఒకేసారి రూ.10 లక్షల నగదును అందిస్తున్నారు. పథకం ద్వారా ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా 40 వేల దళిత కుటుంబాలకు ఆర్థిక సాయాన్ని అందజేశారు. దీంతో కూలీబిడ్డలు ఓనర్లుగా ఎదుగుతుండడమే కాక సామాజిక మార్పునకు ఇది దోహపడుతున్నది. దళితుల ఆత్మగౌరవాన్ని పెంచుతున్నది. సమాజంలో ఇతర వర్గాలతో కలిసిపోయి, సత్సంబంధాలను కొనసాగించేందుకు, సమానత్వాన్ని పొందేందుకు అవకాశాలను కల్పిస్తున్నది. ఇప్పుడు ఈ పథకం యావత్ దేశాన్నే ఆకట్టుకుంటున్నది.
సామాజిక రుగ్మతలను రూపుమాపేందుకు దశాబ్దాలుగా ఎందరో సంఘ సంస్కర్తలు చేసిన ఉద్యమాలను స్ఫూర్తిగా తీసుకొని పాలించిన ప్రభుత్వాలెన్ని?
గాంధీ, అంబేద్కర్, ఫూలే వంటి మహనీయుల ఆశయాల సాధనలో గత పాలకులు ఏ మేరకు సఫలీకృతమయ్యారు? గరీబీ హటావో, జై కిసాన్ నినాదాలు, 20 సూత్రాల పథకాలు, బ్లాక్ డెవలప్మెంట్ ప్రణాళికలు.. చెప్పుకుంటూ పోతే ఎన్నెన్నో కార్యక్రమాలు. పేదరికం, బాల్యవివాహాలు, అక్షరాస్యత, అంటరానితనం నిర్మూలన, మహిళా సాధికారత.. ఎన్నో ప్రణాళికలు.. వెరసి సాధించిన ఫలితాలు అంతంత మాత్రమే. తెలంగాణ ప్రాంతంలో పరిస్థితి మరింత దయనీయం. కానీ, పదేండ్లుగా తెలంగాణ స్వీయ పాలనలో ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్రావు అమలు చేస్తున్న పలు సంక్షేమ పథకాలు రాష్ట్రంలో సామాజిక విప్లవానికి బాటలు వేస్తున్నాయి.
ప్రభుత్వ చర్యల ఫలితంగా సాధిస్తున్న సామాజిక మార్పులివీ…
☞ గురుకుల విద్యను అందుబాటులోకి తీసుకురావడంతో ఇంటర్, డిగ్రీ, పీజీ, బీఎడ్ తదితర ఉన్నతవిద్యా ప్రవేశాల్లో మహిళల సంఖ్య గణనీయంగా పెరిగింది. పీజీ కోర్సుల్లో 72 శాతం.. డిగ్రీలో 52 శాతం.. బీఎడ్ కోర్సుల్లో 81 శాతం అమ్మాయిలే చేరడం ఇందుకు నిదర్శనం.
☞ ఉచిత కోచింగ్ ఫలితంగా దాదాపు 650 మందికిపైగా బాలికలు మెడిసిన్ సీట్లను సంపాదించారు.
☞ కల్యాణలక్ష్మి/షాదీముబారక్ ఫలితంగా బాల్యవివాహాల సంఖ్య తగ్గిపోయింది. తద్వారా మాతాశిశు మరణాల రేటు రికార్డు స్థాయిలో లక్షకు 96 నుంచి 52కు తగ్గిపోయింది. శిశుమరణాల రేటు వెయ్యికి 39-21కు తగ్గిపోయింది. ఇన్స్టిట్యూషనల్ డెలివరీస్ 91-97కు పెరిగాయి.
☞ మహిళా శ్రామిక భాగస్వామ్యంలో 37 శాతంతో దేశంలోనే తెలంగాణ టాప్.
☞ బాల్యవివాహాలతో 16-19 ఏండ్ల మధ్య తల్లులయ్యేవారి సంఖ్య 10.6 శాతం నుంచి 5.8 శాతానికి తగ్గిపోయింది.
☞ మహిళలు బ్యాంక్ అకౌంట్లు 59.5 శాతం నుంచి 84.4 శాతానికి పెరిగింది.
☞ స్త్రీ పురుష నిష్పత్తి 1007-1049కు పెరిగింది.