నీలగిరి, మే 28 : విలేజ్ పోలీస్ వ్యవస్థ ద్వారా ప్రజలకు మరింత చేరువ కావాలని నల్లగొండ జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ సిబ్బందికి సూచించారు. గురువారం నల్లగొండ రూరల్ పోలీస్ స్టేషన్ను ఎస్పీ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పోలీస్ స్టేషన్ పరిధిలోని శాంతిభద్రతల పరిస్థితులు, పెండింగ్ కేసుల దర్యాప్తు, రికార్డుల నిర్వహణ, సిబ్బంది పనితీరు తదితర అంశాలను సమీక్షించారు. స్టేషన్లో నిర్వహిస్తున్న రికార్డులు, క్రైమ్ ప్రాపర్టీలు, సీజ్ చేసిన వాహనాలు, సీసీ కెమెరా పనితీరు, కోర్టు సంబంధిత రికార్డులను పరిశీలించి పలు సూచనలు చేశారు. ప్రజలకు త్వరితగతిన సేవలు అందేలా ప్రతి ఫిర్యాదును బాధ్యతగా స్వీకరించి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని సిబ్బందికి సూచించారు. గ్రామీణ ప్రాంతాల్లో విలేజ్ పోలీస్ వ్యవస్థను మరింత బలోపేతం చేసి ప్రజలకు చేరువ కావాలన్నారు. గ్రామాల్లో అనుమానాస్పద వ్యక్తుల కదలికలపై ప్రత్యేక నిఘా ఉంచాలని, గ్రామ స్థాయి సమాచార వ్యవస్థను సమర్థంగా వినియోగించాలని ఆదేశించారు.
దొంగతనాలు, ఆస్తి నేరాల నివారణకు రాత్రి, పగలు పటిష్ట గస్తీ నిర్వహించాలని, ముఖ్యంగా హైవేలు, గ్రామ శివార్లు, నిర్మానుష్య ప్రాంతాల్లో పోలీసులు నిరంతర పర్యవేక్షణ కొనసాగించాలని సూచించారు. పాత నేరస్తుల కదలికలపై ప్రత్యేక దృష్టి పెట్టి, రౌడీషీటర్లు, అనుమానిత వ్యక్తులను తరచుగా తనిఖీ చేయాలని తెలిపారు. సైబర్ నేరాలపై గ్రామాల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని ఎస్పీ సూచించారు. ప్రజలు ఎలాంటి అనుమానాస్పద ఘటనలు గమనించిన వెంటనే డయల్ 100 లేదా స్థానిక పోలీసులకు సమాచారం ఇవ్వాలని కోరారు. ఈ తనిఖీలో ఎస్పీ వెంట నల్లగొండ డీఎస్పీ శివరాం రెడ్డి, ఎస్బీ సీఐ ఆదిరెడ్డి, 2 టౌన్ సీఐ రాఘవరావు, రూరల్ ఎస్ఐ సైదాబాబు ఉన్నారు.

విలేజ్ పోలీస్ వ్యవస్థ ద్వారా ప్రజలకు మరింత చేరువ కావాలి : ఎస్పీ శరత్ చంద్ర పవార్