Virat Kohli : భారత స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ(Virat Kohli) ప్రస్తుతం భీకర ఫామ్లో ఉన్నాడు. ఐదొందల మ్యాచ్లో సెంచరీ బాదిన విరాట్ ఆసియా కప్(Asia Cup 2023), వన్డే ప్రపంచ కప్(ODI WC2023)లో కీలకం కానున్నాడు. అయితే.. ఈ దిగ్గజ ఆటగాడి గురించి పాకిస్థాన్ మాజీ పేసర్ షోయబ్ అక్తర్(Shoaib Akhtar) ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ప్రపంచ కప్ తర్వాత కోహ్లీ వన్డేలకు వీడ్కోలు పలకాలని, సచిన్ వంద సెంచరీల రికార్డు బద్దలు కొట్టాలంటే అతను టెస్టుల్లో మాత్రమే కొనసాగాలని అక్తర్ అభిప్రాయపడ్డాడు. అతడి వ్యాఖ్యలు సోషల్ మీడియాలో దుమారం రేపాయి.
‘వరల్డ్ కప్ తర్వాత కోహ్లీ 50 ఓవర్ల ఫార్మాట్లో కొనసాగుతాడని నేను అనుకోవడం లేదు. టీ20ల్లో అతను ఈ మధ్య ఆడడం లేదు. విరాట్ మరో ఆరేళ్లు ఆడి సచిన్ టెండూల్కర్(Sachin Tendulkar) నెలకొల్పిన వంద శతకాల రికార్డును బ్రేక్ చేయాలని నేను అనుకుంటున్నా. పరుగుల యంత్రమైన కోహ్లీకి వంద సెంచరీల మార్క్ అందుకోగల సత్తా ఉంది. అందుకని ప్రపంచ కప్ తర్వాత అతను పూర్తిగా టెస్టుల మీదే ఫోకస్ పెట్టాలి. అప్పుడే ఈ ఫీట్ సాధ్యమవుతుంది’ అని అక్తర్ అన్నాడు. అయితే.. భారత జట్టు మాజీ కెప్టెన్ సౌరభ్ గంగూలీ(Sourav Ganguly) మాత్రం అతడి అభిప్రాయంతో ఏకీభవించలేదు. అలా ఎందుకు? కోహ్లీ తనకిష్టమైన ఫార్మాట్లో ఆడతాడు. ఎందుకంటే.. అతను అవలీలగా పరుగులు సాధిస్తాడు అని గంగూలీ గట్టి కౌంటర్ ఇచ్చాడు.
విరాట్ కోహ్లీ, సచిన్ టెండూల్కర్
రెండేళ్ల క్రితం ఫామ్ కోల్పోయిన విరాట్ కోహ్లీ నిరుడు ఆసియా కప్(Asia Cup 2022)తో టచ్లోకి వచ్చాడు. శ్రీలంకపై సెంచరీతో మళ్లీ మునపటి విరాట్ను గుర్తు చేశాడు. ఆ తర్వాత టీ20 ప్రపంచ కప్లో పాకిస్థాన్పై (82 నాటౌట్) సంచలన ఇన్నింగ్స్ ఆడాడు. బంగ్లాదేశ్పై వన్డేల్లో వంద కొట్టాడు. సొంతగడ్డపై బోర్డర్ – గవాస్కర్ ట్రోఫీ(Border Gavaskar Trophy)లో మరో శతకం బాదాడు.
ఐపీఎల్ 16వ సీజన్లో కోహ్లీ సెంచరీల మోత
ఐపీఎల్ 16వ సీజన్లోనూ ఈ రన్ మెషీన్ జోరు కొనసాగించాడు. వరుసగా రెండు సెంచరీలతో తన బ్యాట్ పవర్ చూపించాడు. వెస్టిండీస్తో రెండో టెస్టులో ఈ దిగ్గజ క్రికెటర్ 121 రన్స్తో రికార్డు సృష్టించాడు. ప్రస్తుతం అతను ఆసియా కప్పై దృష్టి పెట్టాడు. ఈసారి హైబ్రిడ్ మోడల్లో జరుగుతున్న ఆసియా కప్ ఆగస్టు 30న మొదలవ్వనుంది. ఆ తర్వాత అంటే.. నెల రోజుల లోపే సొంత గడ్డపై వన్డే ప్రపంచ కప్ పోటీలు షురూ కానున్నాయి.