న్యూఢిల్లీ: వెస్టిండీస్తో వన్డే సిరీస్కు సీనియర్ క్రికెటర్ శిఖర్ ధవన్ కెప్టెన్సీలో భారత జట్టు బరిలోకి దిగుతున్నది. ఈ నెల 22 నుంచి పోర్ట్ ఆఫ్ స్పెయిన్లో మొదలయ్యే మూడు మ్యాచ్ల సిరీస్ కోసం బీసీసీఐ బుధవారం జట్టును ఎంపిక చేసింది. ప్రస్తుతం ఇంగ్లండ్ పర్యటనలో ఉన్న సీనియర్ ప్లేయర్లు రోహిత్శర్మ, విరాట్ కోహ్లీ, బుమ్రా, పంత్, హార్దిక్ పాండ్యా, షమీకి బోర్డు విశ్రాంతినిచ్చింది. ఈ నేపథ్యంలో కెప్టెన్గా ధవన్, వైస్ కెప్టెన్గా ఆల్రౌండర్ రవీంద్ర జడేజా బాధ్యతలు అప్పగిస్తూ బోర్డు నిర్ణయం తీసుకుంది.
ఇంగ్లండ్తో వన్డే సిరీస్ కోసం జట్టులో చోటు దక్కించుకోలేకపోయిన దీపక్ హుడా, సంజూ శాంసన్, రుతురాజ్ గైక్వాడ్, అవేశ్ఖాన్కు విండీస్ సిరీస్కు అవకాశం కల్పించింది.చివరిసారి 2020 డిసెంబర్లో వన్డే మ్యాచ్ ఆడిన యువ ఓపెనర్ శుభ్మన్ గిల్ చాలా రోజుల తర్వాత వన్డే జట్టులో చోటు దక్కింది. మూడింటికి మూడు మ్యాచ్లు పోర్ట్ ఆఫ్ స్పెయిన్ వేదికగా జరుగనున్నాయి. వన్డే సిరీస్ ముగిసిన తర్వాత జూలై 29 నుంచి ఆగస్టు 7 వరకు భారత్, విండీస్ మధ్య ఐదు మ్యాచ్ల టీ20 సిరీస్ జరుగనుంది. ఇందుకోసం జట్టును ఎంపిక చేయా ల్సి ఉంది. టీ20 ప్రపంచకప్ కంటే ముం దు జరిగే ఈ టోర్నీలో సీనియర్ ప్లేయర్లు పాల్గొనే చాన్స్ ఉంది.
వన్డే జట్టు: ధవన్(కెప్టెన్), జడేజా(వైస్ కెప్టెన్), రుతురాజ్ గైక్వాడ్, గిల్, దీపక్ హుడా, సూర్యకుమార్ యాదవ్, శ్రేయాస్ అయ్యర్, ఇషాన్ కిషన్, సంజూ శాంసన్, శార్దూల్ ఠాకూర్, చాహల్, అక్షర్ పటేల్, అవేశ్ఖాన్, ప్రసిద్ధ్ క్రిష్ణ, సిరాజ్, అర్ష్దీప్సింగ్.