న్యూఢిల్లీ: న్యూజిలాండ్తో ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్ ఫైనల్తో పాటు ఆతిథ్య ఇంగ్లాండ్తో టెస్టు సిరీస్ కోసం ఇప్పటికే విరాట్ కోహ్లీ సారథ్యంలోని భారత క్రికెట్ జట్టు ఇంగ్లాండ్కు చేరుకుంది. ఇదే సమయంలో మరో భారత జట్టు శ్రీలంక పర్యటనకు వెళ్లనుంది. లంకతో పరిమిత ఓవర్ల క్రికెట్ సిరీస్ కోసం త్వరలో భారత జట్టును ప్రకటించనున్నారు. వచ్చే జూలైలో శ్రీలంకలో పర్యటించే భారత జట్టుకు కెప్టెన్గా సీనియర్ బ్యాట్స్మన్ శిఖర్ ధావన్, కోచ్గా మాజీ కెప్టెన్ రాహుల్ ద్రవిడ్ను బీసీసీఐ ఎంపికచేయనున్నట్లు తెలుస్తోంది.
భుజం గాయం కారణంగా మరో బ్యాట్స్మన్, ఐపీఎల్లో ఢిల్లీ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ పూర్తిగా కోలుకోకపోవడంతో గబ్బర్కు జట్టు పగ్గాలు అప్పగిస్తారనే ప్రచారం జరుగుతోంది. లంక టూర్కు భారత జట్టును ఎప్పుడు ఎంపికచేస్తారో అనేదానిపై ఇంకా స్పష్టతరాలేదు. మరో వారంలో టీమ్ను సెలక్ట్ చేసే అవకాశం ఉంది. టూర్లో భాగంగా భారత్, లంక మధ్య 3 వన్డేలు, 3 టీ20 మ్యాచ్లు జరుగుతాయి. ఈ సిరీస్ జూలై 13 నుంచి 25 వరకు జరగనుంది. ప్రస్తుతం జాతీయ క్రికెట్ అకాడమీ(ఎన్సీఏ) చీఫ్గా ఉన్న ద్రవిడ్ తొలిసారి సీనియర్ జట్టుతో కలిసి పనిచేయబోతున్నాడు.