అహ్మదాబాద్ : స్వదేశంలో జరుగుతున్న వరల్డ్ ఆర్చరీ పారా సిరీస్ (స్టేజ్ 3)లో భారత ఆర్చర్లు అదరగొడుతున్నారు. యువ సంచలనం, జమ్మూ అమ్మాయి శీతల్ దేవి మహిళల కాంపౌండ్ వ్యక్తిగత విభాగంలో ఫైనల్కు దూసుకెళ్లగా మరో ముగ్గురు ఆర్చర్లు పతక రేసులో ఉన్నారు. సోమవారం జరిగిన కాంపౌండ్ సెమీస్లో శీతల్ 145-143తో భారత్కే చెందిన సరితపై గెలిచి ఐజద సైడన్ (కజకిస్థాన్)తో ఫైనల్ ఆడేందుకు సిద్ధమైంది.
సరిత కాంస్యం కోసం పోటీ పడనుంది. కాంపౌండ్ మిక్స్డ్ టీమ్ విభాగంలో శీతల్, రాకేశ్ కుమార్ జోడీ.. క్వాలిఫికేషన్ రౌండ్లో 1400 పాయింట్లు స్కోరుతో తమ పేరిటే ఉన్న ప్రపంచ రికార్డు (1399)ను బ్రేక్ చేయడంతో వారికి టాప్ సీడ్ దక్కింది. కాంపౌండ్ మెన్స్ కేటగిరీ సెమీస్లో ప్రపంచ నంబర్ వన్ తోమన్ కుమార్.. 144-146తో టాప్ సీడ్ కెన్ స్వగుమిలాంగ్ (ఇండోనేషియా) చేతిలో ఓడినా కాంస్య పతకం కోసం పోటీలోనే ఉన్నాడు.