Shakib Al Hasan : బంగ్లాదేశ్ వన్డే కెప్టెన్సీ(Bangladesh ODI captaincy)పై నెలకొన్న సందిగ్ధత తొలగింది. అందరూ ఊహించినట్టుగానే మాజీ కెప్టెన్ షకిబుల్ హసన్(Shakib Al Hasan)కే సెలెక్టర్లు పగ్గాలు అప్పగించారు. దాంతో, షకిబ్ త్వరలో జరుగనున్న ఆసియా కప్(Asia Cup 2023), వన్డే వరల్డ్ కప్(ODI World Cup 2023)లో బంగ్లాకు సారథ్యం వహించనున్నాడు. తమీమ్ ఇక్బాల్ వన్డే కెప్టెన్గా తప్పుకోవడంతో బంగ్లాదేశ్ తర్వాతి సారథి ఎవరూ? అనే ప్రశ్న మొదలైంది.
వైస్ కెప్టెన్ లిట్టన్ దాస్(Litton Das), యువ సంచలన మెహిదీ హసన్ మిరాజ్(Mehidy Hasan Miraz)లలో ఒకరు నాయకుడు అవుతారనే వార్తలు వినిపించాయి. కానీ, సెలెక్టర్లు మాత్రం అనుభవజ్ఞుడైన అతడి వైపే మొగ్గు చూపారు. ‘ఆసియా కప్, వన్డే వరల్డ్ కప్ పోటీల్లో ఆడే బంగ్లా జట్టుకు షకిబ్ను కెప్టెన్గా సెలెక్ట్ చేశాం. ఈ రెండు మెగా టోర్నీల్లో పాల్గొనే బృందాన్ని రేపు ప్రకటిస్తాం. సెలెక్టర్లు 17మంది ఆటగాళ్లను ఎంపిక చేస్తారు’ అని బంగ్లాదేశ్ చీఫ్ సెలెక్టర్ నజ్ముల్ హసన్(Najmul Hasan) ఓ ప్రకటనలో తెలిపాడు.
షకిబుల్ హసన్
షకిబుల్ హసన్ ప్రస్తుతం లంక ప్రీమియర్ లీగ్(Lanka Premiere League)లో ఆడుతున్నాడు. దాంతో, అతను స్వదేశం వచ్చాక సెలెక్టర్లు అన్ని విషయాలు చర్చించనున్నారు. బంగ్లా జట్టు 2019 ప్రపంచ కప్లో షకిబుల్ నేతృత్వంలో బరిలోకి దిగింది. అతను వరుసగా రెండోసారి మెగా టోర్నీకి సారథిగా ఎంపికవ్వడం విశేషం. ఈ ఏడాది వన్డే వరల్డ్ కప్ భారత గడ్డపై అక్టబర్ 5న మొదలవ్వనుంది. మహ్మదుల్లా రియాద్ నుంచి నిరుడు షకిబ్ టీ20 పగ్గాలు అందుకున్నాడు. అప్పటి నుంచి అతను టెస్టు, టీ20ల్లో కెప్టెన్గా కొనసాగుతున్నాడు. అయితే.. ఈ స్టార్ ఆల్రౌండర్ ఇకపై అన్ని ఫార్మాట్లలో సారథిగా కొనసాగుతాడా? లేదా? అనేది తెలియాల్సి ఉంది.