గుల్బర్గా: దిగ్గజ ఫుట్బాల్ ఆటగాడు, హైదరాబాదీ సయీద్ షాహిద్ హకీమ్ ఆదివారం తుదిశ్వాస విడిచారు. 82 ఏండ్ల హకీమ్కు ఆదివారం ఉదయం గుండెపోటు రావడంతో గుల్బర్గాలోని ఓ ప్రైవేట్ దవాఖానాకు తరలించగా.. అక్కడ చికిత్స పొందుతూ కన్నుమూశారు. సయీద్ భార్య సదియా ఈ విషయాన్ని వెల్లడించారు. సుమారు ఐదు దశాబ్దాల పాటు భారత ఫుట్బాల్కు ఎనలేని సేవలందించిన సయీద్.. 1939 జూన్ 23న హైదరాబాద్లో జన్మించారు. భారత ఫుట్బాల్ కోచ్ (1950-63)గా వ్యవహరించిన సయీద్ అబ్దుల్ రహీం కొడుకే హకీమ్. 1960లో రోమ్లో జరిగిన ఒలింపిక్స్లో పాల్గొన్న భారత ఫుట్బాల్ జట్టులో హకీమ్ సభ్యుడు కాగా ఆ జట్టుకు అబ్దుల్ రహీం కోచ్గా వ్యవహరించడం గమనార్హం. హైదరాబాద్ సిటీ కాలేజ్ తరఫున ఆడిన హకీమ్.. ఆటగాడిగా రిటైర్ అయ్యాక కోచ్గా మారారు. దేశంలోని పలు ఫుట్బాల్ క్లబ్లకు ఆయన కోచ్గా పనిచేశారు. ఫుట్బాల్కు ఆయన చేసిన సేవలకు గాను భారత ప్రభుత్వం ఈ దిగ్గజ ఆటగాడిని ద్రోణాచార్య అవార్డుతో సత్కరించింది.
ఫిఫా రిఫరీగానూ సేవలు
ఆటగాడిగా, కోచ్గానే కాక హకీమ్ ఫిఫా రిఫరీగానూ వ్యవహరించారు. 33 అంతర్జాతీయ మ్యాచ్లకు రిఫరీగా బాధ్యతలు నిర్వర్తించారు. ఆయన మృతి పట్ల ఆలిండియా ఫుట్బాల్ ఫెడరేషన్ (ఏఐఎఫ్ఎఫ్) అధ్యక్షుడు ప్రఫుల్ పటేల్, తెలంగాణ ఫుట్బాల్ సంఘం అధ్యక్షుడు విచారం వ్యక్తం చేశారు. హకీమ్ కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు.
అజయ్ దేవ్గన్ సంతాపం
హకీమ్ మృతి పట్ల బాలీవుడ్ నటుడు అజయ్ దేవ్గన్ సంతాపం ప్రకటించారు. ఆయన మృతితో భారత ఫుట్బాల్ ఒక దిగ్గజ ఆటగాడిని కోల్పోయిందని అన్నారు. త్వరలో విడుదల కానున్న ‘మైదాన్’ సినిమాలో అజయ్.. హకీమ్ తండ్రి అబ్దుల్ రహీం పాత్ర పోషిస్తున్నారు. ఈ సినిమా కోసం రీసెర్చ్ చేస్తున్నప్పుడు హకీమ్ తనకు ఎన్నో విషయాలు చెప్పారని అజయ్ దేవ్గన్ గుర్తుచేసుకున్నారు.