Shaheen Afridi : ఆసియా కప్(Asia cup 2023)లో భారత్(India), పాకిస్థాన్(Pakistan) మధ్య రేపు కీలకమైన సూపర్ 4 మ్యాచ్ జరుగనుంది. దాయాదుల పోరులో ఈసారి పైచేయి సాధించేది ఎవరు? అనే ఉత్కంఠ నెలకొంది. ఈ హైటెన్షన్ మ్యాచ్కు ముందు పాకిస్థన్ స్టార్ పేసర్ షాహీన్ ఆఫ్రీదీ(Shaheen Afridi) భారత ఆటగాళ్లను హెచ్చరించాడు. తన అత్యుత్తమ ప్రదర్శన బాకీ ఉందని, టీమిండియాతో సూపర్ 4 మ్యాచ్లో తన పేస్ పదును చూపిస్తానని అన్నాడు.
‘భారత జట్టుతో ప్రతి మ్యాచ్ ఎంతో ప్రత్యేకం. కోట్లాది మంది ఈ మ్యాచ్ చూస్తారు. నేను అండర్ 19 జట్టుకు ఆడే రోజుల్లో అందరిలానే ఇండియా, పాక్ మ్యాచ్ కోసం ఎంతో ఆతృతగా ఎదురుచూసేవాడిని. అయితే.. ఇదే నా బెస్ట్ బౌలింగ్ అని చెప్పలేను. ఇది ప్రారంభం మాత్రమే. నా అత్యుత్తమ ప్రదర్శన ఇంకా బాకీ ఉంది’ అని ఆఫ్రీదీ వెల్లడించాడు. పవర్ ప్లేలో కొత్త బంతితో నిప్పులు చెరిగే షాహీన్ ఆఫ్రీదీ రేపు జరిగే సూపర్ 4 మ్యాచ్లో కీలకం కానున్నాడు. సెప్టెంబర్ 2న భారత్పై 4 వికెట్లతో చెలరేగిన ఈ స్పీడ్స్టర్ మళ్లీ తడాఖా చూపేందుకు ఉవ్విళ్లూరుతున్నాడు. అంతేకాదు పాక్ అభిమానులు తనపై ఎన్నో అంచనాలు పెట్టుకున్నారని గుర్తు చేశాడు.
కోహ్లీ, రోహిత్ను బౌల్డ్ చేసిన ఆఫ్రీదీ
‘చిన్న వయసులోనే మూడు ఫార్మాట్లలో పాకిస్థాన్కు ప్రాతినిధ్యం వహించడం సంతషకరం. అయితే.. కొత్త బంతితో వికెట్లు తీసి జట్టుకు బ్రేక్ ఇవ్వాలని ఫ్యాన్స్ ఆశిస్తారు. కొత్త, పాత బంతితో ఏం చేయాలో మాకు తెలుసు. హరిస్ రవుఫ్, నసీం షా తమ పేస్తో హడలెల్తించగలరు. మా మధ్య సమన్వయం బాగుంది. అందుకనే మా త్రయం సక్సెస్ఫుల్ అవుతోంది’ అని ఈ స్పీడ్ గన్ చెప్పుకొచ్చాడు.
భారత్, పాక్ మ్యాచ్కు వర్షం ముప్పు నేపథ్యలో రిజర్వ్ డేను కేటాయించింది. ఈ టోర్నీలో ఇరుజట్ల మధ్య జరిగిన తొలి మ్యాచ్ వర్షం కారణంగా రద్దు అయింది. దాంతో, ఫ్యాన్స్ తీవ్ర నిరాశకు గురయ్యారు. అందుకని ఈసారి ఆ సమస్య తలెత్తకుండా రిజర్వ్ డేన మ్యాచ్ ఆడించనున్నారు. సూపర్ 4 ఫైట్ కోసం టీమిండియా ఆటగాళ్లు పూర్తి స్థాయిలో సిద్దమవుతున్నారు. యార్కర్ కింగ్ బుమ్రాతో పాటు కేఎల్ రాహుల్ జట్టులోకి రావడంతో భారత జట్టు బలంగా కనిపిస్తోంది.