న్యూఢిల్లీ: ఆసియా క్రికెట్ కప్ సూపర్-4లో భాగంగా భారత్-పాకిస్థాన్ జట్ల మధ్య జరిగే మ్యాచ్కు రిజర్వ్ డే పెట్టడాన్ని భారత మాజీ పేసర్ వెంకటేశ్ ప్రసాద్ (Vekatesh Prasad) తప్పుపట్టాడు. ఈ నిర్ణయం తీసుకున్న ఏషియన్ క్రికెట్ కౌన్సిల్ (ACC) పై తీవ్ర విమర్శలు గుప్పించాడు. టోర్నమెంట్ నియమావళికి విరుద్ధంగా కేవలం ఓ రెండు జట్ల మధ్య జరిగే ఒక మ్యాచ్కు మాత్రమే రిజర్వ్ డేను ఎలా ప్రకటిస్తారని ఆయన మండిపడ్డాడు.
ఏషియన్ క్రికెట్ కౌన్సిల్ నిర్ణయం పూర్తిగా సిగ్గుమాలిన నిర్ణయమని, నీతిమాలిన చర్య అని, ఇది టోర్నమెంట్ నియమావళిని ఎగతాళి చేయడమేనని విమర్శించాడు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశాడు. ఏసీసీ దుర్మార్గపు నిర్ణయం వైఫల్యం చెందుతుందని శాపనార్ధం పెట్టాడు. అంటే రెండు రోజులు కూడా మ్యాచ్ వర్షార్పణం అవుతుందని, అప్పుడు టోర్నీ న్యాయంగా జరిగినట్లవుతుందనే అర్ధం వచ్చేలా వెంకటేశ్ ప్రసాద్ వ్యాఖ్యలు చేశాడు.
కాగా, గ్రూప్ స్థాయిలో భారత్-పాకిస్తాన్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్ వర్షం వల్ల రద్దయ్యింది. ఈ నెల 10న సూపర్ 4 స్థాయిలో ఇరు జట్లు మరోసారి తలపడే అవకాశం వచ్చింది. శ్రీలంక రాజధాని కొలంబోలోని ప్రేమదాస అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో జరిగే ఈ మ్యాచ్కు కూడా వర్షం అంతరాయం కలిగించే అవకాశం ఉందని అక్కడి వాతావరణ కేంద్రం తెలిపింది. ఈ నేపథ్యంలో సెప్టెంబర్ 10న వర్షం వల్ల మ్యాచ్ సాధ్యంకాకపోతే సెప్టెంబర్ 11న నిర్వహించేలా ఏసీసీ రిజర్వ్ డేను ప్రకటించింది.