Shafali Verma : అండర్-19 టీ20 వరల్డ్ కప్ ఫైనల్ ఆడుతున్నందుకు జట్టంతా ఎంతో ఉత్సాహంతో ఉందని భారత జట్టు కెప్టెన్ షెఫాలీ వర్మ తెలిపింది. ‘ఫైనల్ అడుతున్నామనే ఫీలింగ్ మ అందరికీ గొప్పగా అనిపిస్తోంది. తమ బాధ్యతలు ఏంటి? రేపటి మ్యాచ్లో ఏం చేయాలి? అనేది జట్టులోని ప్రతి ఒక్కరికి బాగా తెలుసు. ఫైనల్లో ఒకరికొకరం మద్దతుగా నిలుస్తూ సమిష్టిగా పోరాడుతాం’ అని షెఫాలీ వర్మ వెల్లడించింది. ఆదివారం జరగనున్న టైటిల్ పోరులో టీమిండియా, ఇంగ్లండ్తో తలపడనుంది. తొలి సెమీఫైనల్లో భారత్ 8 వికెట్ల తేడాతో కివీస్ను చిత్తు చేసింది. ఐసీసీ మొదటిసారి నిర్వహిస్తున్న ఈ టోర్నీలో అత్యధిక పరుగులు చేసిన ప్లేయర్స్లో షెఫాలీ మూడో స్థానంలో ఉంది. 201.08 స్ట్రయిక్ రేటుతో ఆమె 157 రన్స్ చేసింది.
ఒత్తిడికి లోనవ్వకూడదు
‘నేను టీ20 వరల్డ్ కప్ 2020, కామన్వెల్త్ గేమ్స్ ఫైనల్ ఆడాను. ఫైనల్ మ్యాచ్ ఆడుతున్న ఫీలింగ్ ఎలా ఉంటుందో నాకు తెలుసు. అందుకనే జట్టు సభ్యులకు ఆటను ఆస్వాదించాలని, దీన్ని ఫైనల్గా అనుకోవద్దని చెప్పాను. అంతేకాదు ప్రతి ఒక్కరి వంద శాతం ప్రదర్శన ఇవ్వాలి. ఒత్తిడికి లోనవ్వకూడదు. ఎందుకంటే.. ఒత్తిడికి గురైతే మ్యాచ్ ఆడడం కష్టంగా అనిపిస్తుంది. అందుకని ప్రతి ఒక్కరు తమ శక్తిసామర్ధ్యాలపై నమ్మకం ఉంచాలి’ అని షెఫాలీ తెలిపింది. అండర్ -19 టీ20 వరల్డ్ కప్ ఫైనల్ చేరిన భారత్ కప్పు కొట్టాలనే కసితో ఉంది. స్పిన్నర్ పర్షవి చోప్రా 3 వికెట్లు తీసి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించింది.