మాంచెస్టర్: మహిళల టీ20 ప్రపంచకప్లో భారత వరుస విజయాలకు బ్రేక్ పడింది. పాకిస్థాన్, నెదర్లాండ్స్పై భారీ విజయాలతో జోరు మీద కనిపించిన టీమ్ ఇండియాకు చుక్కెదురైంది. ఆదివారం జరిగిన గ్రూపు-1 లీగ్ పోరులో భారత్ 6 వికెట్ల తేడాతో సఫారీల చేతిలో ఓటమిపాలైంది. బ్యాటింగ్ వైఫల్యం హర్మన్ప్రీత్కౌర్ సేన కొంపముంచింది. షెఫాలీవర్మ(31), దీప్తిశర్మ(29) బ్యాటింగ్తో తొలుత భారత్ 20 ఓవర్లలో 158-7 స్కోరుకు పరిమితమైంది. మెగాటోర్నీలో మంచి ఫామ్మీదున్న స్టార్ ఓపెనర్ స్మృతి మందన(17) విఫలం కావడంతో టీమ్ఇండియాకు మెరుగైన శుభారంభం దక్కలేదు.
సఫారీల కట్టుదిట్టమైన బౌలింగ్ భారత బ్యాటర్లు స్వల్ప స్కోర్లకే వెనుదిరిగారు. యస్తికా భాటియా(15), రోడ్రిగ్స్(12), రీచా ఘోష్(15) అంతగా ఆకట్టుకోలేకపోయారు. మారిజానె కాప్(2-27), షబ్నమ్ ఇస్మాయిల్(2-28) రాణించారు. 159 పరుగుల లక్ష్యఛేదనలో దక్షిణాఫ్రికా 19.1 ఓవర్లలో 161-4 స్కోరు చేసింది. మారిజానె కాప్(45 బంతుల్లో 81 నాటౌట్, 7ఫోర్లు, 4సిక్స్లు) అజేయ అర్ధసెంచరీతో జట్టు విజయంలో కీలకమైంది. తెలుగు స్పిన్నర్ శ్రీచరణి(3-24) రాణించినా లాభం లేకపోయింది. మారిజానెకు ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ దక్కింది.