గత రెండు పర్యాయాలు తుది మెట్టుపై బోల్తా కొట్టిన పుణెరి పల్టన్ ఈసారి ఆ అడ్డంకిని అధిగమించి చాంపియన్గా అవతరించింది. శుక్రవారం హైదరాబాద్ వేదికగా జరిగిన హోరోహారీ ఫైనల్లో హర్యానా స్టీలర్స్పై పల్టన్ విజయం సాధించింది. రైడింగ్లో ఇరు జట్లు సమంగా నిలిచినా.. ట్యాక్లింగ్లో సత్తాచాటిన పల్టన్ చాంపియన్గా అవతరించింది.
Pro Kabaddi | హైదరాబాద్, ఆట ప్రతినిధి: మూడు నెలలుగా అభిమానులను ఉర్రూతలూగించిన ప్రొ కబడ్డీ లీగ్ (పీకేఎల్) సీజన్-10కు ఘన ముగింపు లభించింది. లీగ్లో కొత్త చాంపియన్ అవతరించింది. ఉత్కంఠ భరితంగా సాగిన టైటిల్ పోరులో హర్యానా స్టీలర్స్ను చిత్తు చేసిన పుణెరి పల్టన్ జట్టు టైటిల్ కైవసం చేసుకుంది. శుక్రవారం హైదరాబాద్లోని గచ్చిబౌలీ స్టేడియంలో జరిగిన తుదిపోరులో పల్టన్ 2825తో హర్యానా స్టీలర్స్పై విజయ కేతనం ఎగరవేసింది. పల్టన్ తరఫున పంకజ్ మోహిత్ 9 రైడ్ పాయింట్లతో చెలరేగగా.. మోహిత్ గోయత్ (5 పాయింట్లు), అస్లమ్ ఇమాన్దార్ (4 పాయింట్లు), డిఫెండర్ గౌరవ్ ఖత్రి (4 పాయింట్లు) రాణించారు. మరోవైపు హర్యానా స్టీలర్స్ తరఫున శివ (6), సిద్ధార్థ్ దేశాయ్ (4), వినయ్ (3) పోరాడినా ఫలితం లేకపోయింది. తుది పోరులో ఇరుజట్లు రైడింగ్లో సమంగా నిలిచినా.. డిఫెన్స్లో బలంగా ఉన్న పల్టన్ టైటిల్ ఎగరేసుకుపోయింది. ఇరు జట్లు రైడింగ్లో చెరో 17 పాయింట్లు సాధించగా.. డిఫెన్స్లో పల్టన్ 9 పాయింట్లు సహా ఓ ఆలౌట్ బోనస్ దక్కించుకుంది. హర్యానా 5 ట్యాకిల్స్కే పరిమితమై టైటిల్కు అడుగు దూరంలో నిలిచింది.
ఉత్కంఠభరితంగా..
ప్రొ కబడ్డీ లీగ్లో వరుసగా రెండో ఏడాది ఫైనల్కు చేరుకున్న పల్టన్ తమ టైటిల్ కల నెరవేర్చుకుంది. గ్రూప్ దశలో తిరుగులేని ఆధిక్యం కనబర్చిన పల్టన్.. పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో నిలువగా.. హర్యానా కూడా నిలకడైన విజయాలతో ముందుకు సాగింది. డిఫెన్స్లో అత్యంత పటిష్టమైన జట్లుగా పేరు తెచ్చుకున్న పల్టన్, స్టీలర్స్ మధ్య పోరు రసవత్తరంగా సాగింది. ఇరు జట్ల ఆటగాళ్లు ఆచితూచి ఆడటంతో.. డై ఆర్ డై రైడ్లో తప్ప మిగతా రైడ్స్లో ఎక్కువ పాయింట్లు రాలేదు. బలమైన డిఫెన్స్ కనబర్చడంతో తొలి అర్ధభాగంలో ఒక దశలో స్కోర్లు 7-7తో సమం కాగా.. పల్టన్ రైడర్ పంకజ్ మ్యాచ్ను మలుపుతిప్పాడు. చావోరేవో రైడ్లో పంకజ్ నాలు పాయింట్లు సాధించి జట్టుకు ఆధిక్యం అందించాడు. దీంతో ప్రథమార్థం ముగిసేసరికి పల్టన్ 13-10తో ముందంజలో నిలిచింది. సెకండ్ హాప్లో హర్యానా స్టీలర్స్ పుంజుకునే ప్రయత్నం చేసినా ఫలితం లేకపోయపోయింది. ఒక దశలో 18-11తో సంపూర్ణ ఆధిపత్యం కనబర్చిన పల్టన్ ఆ తర్వాత ప్రత్యర్థికి కొన్ని పాయింట్లు సాధించే చాన్స్ ఇచ్చినా.. చివర్లో తేరుకొని గెలుపొందింది. ద్వితీయార్థంలో హర్యానా, పల్టన్ చెరో 15 పాయింట్లు సాధించినా.. ఫస్ట్హాఫ్లో పుణె సాధించిన మూడు పాయింట్ల ఆధిక్యం.. ఆ జట్టును విజేతగా నిలువడం కీలక పాత్ర పోషించింది.