Women’s World Boxing Championships | భారత బాక్సింగ్ చరిత్రలో నూతన అధ్యాయం. సొంతగడ్డపై మన బాక్సర్లు దుమ్మురేపారు. బౌట్లో దిగనంత వరకే బరిలోకి దిగితే గిరిగీసి కొట్లాడుడే అన్నట్లు ప్రత్యర్థులపై విరుచుకుపడ్డారు. ప్రతిష్ఠాత్మక బాక్సింగ్ ప్రపంచ చాంపియన్షిప్లో నీతూ గంగాస్, స్వీటీ బూర కొత్త చరిత్ర లిఖించారు. ప్రత్యర్థి ఎవరన్నది లెక్కచేయకుండా గెలుపే లక్ష్యంగా పోటీకి సై అన్న నీతు, స్వీటీ పసిడి పతకాలతో జిగేల్ అనిపించారు. ప్రత్యర్థులపై పదునైన పంచ్లతో విరుచుకుపడుతూ ప్రపంచ చాంపియన్లుగా నిలిచారు. సొంత ఇలాఖాలో చిరస్మరణీయ విజయంతో దేశ ప్రజల అభిమానాన్ని చూరగొన్నారు. నేడు జరిగే ఫైనల్ పోరులో నిఖత్ జరీన్, లవ్లీనా బొర్గోహై పోటీకి దిగనున్నారు.
న్యూఢిల్లీ: ప్రతిష్ఠాత్మక మహిళల బాక్సింగ్ ప్రపంచ చాంపియన్షిప్లో భారత్ అదిరిపోయే బోణీ కొట్టింది. అంచనాలకు అనుగుణంగా మన బాక్సర్లు నీతూ గంగాస్, స్వీటీ బూర పసిడి పతకాలతో తళుక్కుమన్నారు. బరిలోకి దిగిన తొలిసారే నీతు స్వర్ణ పతకం ఒడిసిపట్టుకుంటే, తొమ్మిదేండ్ల సుదీర్ఘ విరామం తర్వాత స్వీటీ తన పసిడి కలను సాకారం చేసుకుంది. స్వర్ణ పతకాలు సాధించడం ద్వారా దిగ్గజ బాక్సర్, ఆరు సార్లు ప్రపంచ విజేత మేరీకోమ్, సరితాదేవి, జెన్నీ, లేఖ, నిఖత్ జరీన్ సరసన నీతు, స్వీటీ నిలిచారు. ఫైనల్ బౌట్ల విషయానికొస్తే తొలుత జరిగిన 48కిలోల విభాగం ఫైనల్లో యువ బాక్సర్ నీతు 5-0 తేడాతో లుట్స్సకైన్ అట్లాన్స్టెగ్(మంగోలియా)పై అద్భుత విజయం సాధించింది.
మెగాటోర్నీలో తిరుగులేని విజయాలతో తుదిపోరులోకి అడుగుపెట్టిన ఈ బివానీ బాక్సర్ అదే జోరు కొనసాగించింది. తన ఎత్తును అనుకూలంగా మలుచుకుంటూ మంగోలియా బాక్సర్పై సూపర్ పంచ్లతో విరుచుకుపడింది. తొలి రౌండ్లో పూర్తి ఆధిపత్యం ప్రదర్శించిన నీతుకు రెండో రౌండ్లో ప్రత్యర్థి నుంచి ఒకింత ప్రతిఘటన ఎదురైంది. అయితే మూడో రౌండ్లో ఎక్కడా పట్టు సడలించని నీతు..మంగోలియా బాక్సర్ లక్ష్యంగా క్లీన్ పంచ్లు, జాబ్స్, హుక్స్తో ముప్పేట దాడికి పాల్పడింది. ఈ క్రమంలో రిఫరీల నుంచి కీలక పాయింట్లు ఖాతాలో వేసుకుంది. విజేతగా రిఫరీ తన పేరు ప్రకటించగానే ఒక్కసారిగా భావోద్వేగానికి గురైన నీతు ఉబికి వస్తున్న కన్నీళ్లను ఆపుకుంటూ అభిమానులకు అభివాదం చేసింది. తాను ఎంతగానో అభిమానించే స్టార్ బాక్సర్ విజేందర్సింగ్.. ప్రశంసలు పొందింది.
భారత సీనియర్ బాక్సర్ స్వీటీ బూర తన చిరకాల కల నెరవేర్చుకుంది. చివరిసారి 2014 ప్రపంచ చాంపియన్షిప్లో రజతం గెలిచిన స్వీటీ..తొమ్మిదేండ్ల తర్వాత పసిడి పతకాన్ని ముద్దాడింది. శనివారం జరిగిన 81 కిలోల తుదిపోరులో స్వీటీ 4-3 తేడాతో వాంగ్ లీనా(చైనా)పై ఉత్కంఠ విజయాన్ని సొంతం చేసుకుంది. బౌట్ విషయానికొస్తే ఎలాగైనా పసిడి దక్కించుకోవాలన్న పట్టుదలతో పోటీకి దిగిన స్వీటీకి చైనా బాక్సర్ నుంచి ప్రతిఘటన ఎదురైంది. తొలి రౌండ్లో స్వీటీ సంధించిన పంచ్లు పట్టుతప్పాయి. అయితే చైనా బాక్సర్ ఎత్తుగడను అంచనా వేసిన స్వీటీ కచ్చితమైన పంచ్లతో పోటీలోకి వచ్చింది. దీంతో రెండో రౌండ్ ముగిసే సరికి ఈ హర్యానా బాక్సర్ 3-2 ఆధిక్యం కనబరిచింది. అయితే మూడో రౌండ్లో ప్రత్యర్థి పంచ్ల నుంచి తప్పించుకుంటూ వీలుచిక్కినప్పుడల్లా జాబ్స్, హుక్స్తో ఆకట్టుకునే ప్రయత్నం చేసి సఫలమైంది. మొత్తంగా తనలో సత్తా తగ్గలేదని నిరూపిస్తూ ఈ హర్యానా బాక్సర్ ప్రపంచ చాంపియన్షిప్ టైటిల్ను కైవసం చేసుకుంది. ఇదిలా ఉంటే ఆదివారం నిఖత్ జరీన్, లవ్లీనా బొర్గోహై స్వర్ణ పతక పోరులో తలపడనున్నారు.
ఆసియా గేమ్స్కు నిఖత్, లవ్లీనా
చైనా వేదికగా జరుగనున్న ప్రతిష్ఠాత్మక ఆసియా గేమ్స్కు భారత యువ బాక్సర్లు నిఖత్ జరీన్, లవ్లీనా బొర్గోహై అర్హత సాధించారు. ప్రస్తుతం జరుగుతున్న ప్రపంచ చాంపియన్షిప్లో స్వర్ణ, రజత పతకాలు గెలిచిన వాళ్లు నేరుగా ఆసియాగేమ్స్కు అర్హత దక్కించుకుంటారని భారత హై ఫెర్ఫార్మెన్స్ డైరెక్టర్ బెర్నార్డ్ డ్యున్ పేర్కొన్నాడు. పారిస్(2024) ఒలింపిక్స్కు తొలి అర్హత టోర్నీగా భావిస్తున్న హంగ్జు ఆసియా గేమ్స్లో నిఖత్, లవ్లీన భారత్ తరఫున బరిలోకి దిగుతారని తెలిపాడు. ఆసియా గేమ్స్లో మహిళా బాక్సర్లు మొత్తం ఐదు కేటగీరీ(51కి, 57కి, 60కి, 69కి, 75కి)ల్లో పోటీ పడనున్నారు.
నేటి షెడ్యూల్ లైట్ ఫ్లై విభాగం
(48-50కి) నిఖత్ జరీన్ X న్యుయెన్ తీ తమ్
మిడిల్వెయిట్(70-75కి)
లవ్లీనా బొర్గోహై X పార్కర్
సా: 6 నుంచి డీడీ స్పోర్ట్స్లో