మెల్బోర్న్: ఇండియాలో కరోనా సెకండ్ వేవ్ ఎంత భయానకంగా ఉందో చెప్పుకొచ్చాడు ఆస్ట్రేలియా క్రికెటర్ డేవిడ్ వార్నర్. ఐపీఎల్లో సన్రైజర్స్ టీమ్ మాజీ కెప్టెన్ అయిన వార్నర్.. ఈ మధ్యే అన్ని అడ్డంకులు అధిగమించి తన ఇంటికి చేరాడు. ఈ సందర్భంగా ఓ షోలో మాట్లాడుతూ.. ఇండియాలోని దారుణ పరిస్థితులను వార్నర్ వివరించాడు. అక్కడి పరిస్థితులు తనను కలచివేసినట్లు చెప్పాడు.
ఆక్సిజన్ కోసం ఇండియాలోని ప్రజలు అల్లాడిపోవడం నేను చూశాను. అది అందరినీ కలచివేసింది. గ్రౌండ్ నుంచి హోటల్కు వెళ్లి వచ్చే సమయాల్లో కరోనాతో ప్రాణాలు కోల్పోయిన తమవాళ్లకు అంతిమ సంస్కారాలు నిర్వహించడానికి కుటుంబ సభ్యులు వీధుల్లో లైన్లు కట్టడం కూడా నేను చూశాను. అది చాలా భయానకంగా అనిపించింది అని వార్నర్ అన్నాడు. ఇక ఇలాంటి పరిస్థితుల్లో ఐపీఎల్ను రద్దు చేయడం సరైన నిర్ణయమని అతడు అభిప్రాయపడ్డాడు.
బబుల్లోనూ కేసులు నమోదు అయిన తర్వాత ప్లేయర్స్ అంతా అక్కడి నుంచి బయటపడాలని అనుకున్నట్లు చెప్పాడు. ఇండియన్స్కు క్రికెట్ అంటే చాలా ఇష్టం. అందుకే ఎట్టి పరిస్థితుల్లోనూ ఐపీఎల్ను నిర్వహించడానికి ప్రయత్నించారు. కానీ అది సాధ్యం కాలేదు. ఇది చాలా సవాలుతో కూడుకున్నది. కేసులు నమోదైన తర్వాత మేము సాధ్యమైనంత త్వరగా బయటపడాలని చూశాం అని వార్నర్ చెప్పాడు.