IPL: ఇంతింతై వటుడింతై అన్న చందంగా ఎదిగిన ఇండియన్ ప్రీమియర్ లీగ్ భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ)కి కాసుల వర్షం కురిపిస్తున్నది. గతేడాది ఐపీఎల్ మీడియా హక్కుల వేలం ద్వారా సుమారు రూ. 50 వేల కోట్లు ఆర్జించిన బీసీసీఐ.. ఈ లీగ్ను ప్రపంచంలోనే సెకండ్ రిచెస్ట్ లీగ్ గా నిలిపింది. అభిమానులకు వినోదం, ఆటగాళ్లకు కోట్లాది కాంట్రాక్టులు, ఫ్రాంచైజీ ఓనర్లకు లాభాల పంట పండిస్తున్న ఈ మెగా టోర్నీలో పెట్టుబడులు పెట్టేందుకు అంతర్జాతీయ కంపెనీలు సైతం క్యూ కడుతున్న విషయం తెలిసిందే. ఐపీఎల్ స్థాయి పెరిగిన నేపథ్యంలో ఈ క్యాష్ రిచ్ లీగ్లో పెట్టుబడులు పెట్టేందుకు అరబ్ దేశం సౌదీ అరేబియా అమితాసక్తి చూపుతోంది. ఈ మెగా లీగ్లో భారీగా పెట్టుబడులు పెట్టే దిశగా పావులు కదుపుతున్నది.
బ్లూమ్బర్గ్ నివేదిక ప్రకారం.. సౌదీ రాజు మహ్మద్ బిన్ సల్మాన్ సలహాదారులు భారత ప్రభుత్వ ప్రతినిధులతో ఇదివరకే ఈ విషయాన్ని చర్చించినట్టు సమాచారం. ఐపీఎల్లో ఐదు బిలియన్ డాలర్ల పెట్టుబడులు పెట్టేందుకు సౌదీకి చెందిన రెండు అగ్రశ్రేణి వ్యాపార సంస్థలు ముందుకొచ్చినట్టు తెలుస్తున్నది. ఇదే విషయమై సెప్టెంబర్లో ఢిల్లీ వేదికగా అత్యంత అట్టహాసంగా ముగిసిన జీ-20 సమావేశాలలో సౌదీ రాజుతో వచ్చిన ప్రతినిధులు.. భారత ప్రభుత్వం ముందు ఈ ప్రతిపాదన ఉంచినట్టు తెలుస్తున్నది.
ఆల్రెడీ ఎంట్రీ..
ఐపీఎల్లో ఇదివరకే సౌదీ ఎంట్రీ ఇచ్చింది. ప్రపంచ దిగ్గజ ఆయిల్ సంస్థ ఆరామ్కో తో పాటు సౌదీ అరేబియా పర్యాటక శాఖలు ఐపీఎల్ స్పాన్సర్స్గా ఉన్నాయి. వాస్తవానికి గతేడాది ఐపీఎల్ తరహా లీగ్ను సౌదీలో నిర్వహించాలని ఆ దేశం భావించింది. అందుకు బీసీసీఐతో పాటు ఇక్కడి ఐపీఎల్ ఫ్రాంచైజీ ఓనర్లతోనూ చర్చలు జరిపినట్టు వార్తలు వచ్చినా అది కార్యరూపం దాల్చలేదు. దీంతో సౌదీలో క్రికెట్ లీగ్ ఏర్పాటును విరమించుకున్న సౌదీ.. ఐపీఎల్ లోనే భారీ పెట్టుబడులు పెట్టి దానిపై గుత్తాధిపత్యం దక్కించుకోవాలనే ప్రణాళికలో ఉన్నట్టు తెలుస్తోంది.
Saudi Arabia has proposed investing $5 billion in the IPL. (Bloomberg). pic.twitter.com/4FulKlh6ET
— Mufaddal Vohra (@mufaddal_vohra) November 3, 2023
బీసీసీఐకి ముప్పే..?
సౌదీ అరేబియా ఐపీఎల్ లో పెట్టుబడులు పెట్టడం వల్ల ఐపీఎల్ పరిధి మరింత విస్తృతమవుతుందనడంలో సందేహమే లేదు. కానీ అధిక వాటాలు కలిగిన వాటాదారు చెప్పినట్టు వినాల్సి వస్తే అది బీసీసీఐతో పాటు ఐపీఎల్ అస్థిత్వానికే ముప్పు అని క్రికెట్ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. భారత ఆటగాళ్లను ఇతర లీగ్లలో ఆడేందుకు అనుమతించని బీసీసీఐ.. ఈ నిబంధనకు కూడా గండికొట్టాల్సి వస్తుంది. నియంత్రణ అధికారం బీసీసీఐ చేతిలోనే ఉన్నా కీలక నిర్ణయాలలో అరబ్ రాజుల జోక్యం తప్పకపోవచ్చుననే ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. అయితే ప్రస్తుతానికి బీసీసీఐ ఈ ప్రతిపాదనను హోల్డ్ లోనే పెట్టినట్టు సమాచారం. భారత్లో వచ్చే ఏడాది సాధారణ ఎన్నికల తర్వాత సౌదీ ప్రతిపాదనపై ప్రభుత్వం గానీ బీసీసీఐ గానీ నిర్ణయం తీసుకునే అవకాశముందని బోర్డు వర్గాలు చెబుతున్నాయి.