నింగ్బొ (చైనా) : ప్రతిష్టాత్మక బ్యాడ్మింటన్ ఆసియా చాంపియన్షిప్స్ నుంచి భారత బ్యాడ్మింటన్ ద్వయం సాత్విక్ సాయిరాజ్-చిరాగ్ శెట్టి తప్పుకున్నారు. కొద్దిరోజుల క్రితం స్విస్ ఓపెన్ ఆడుతూ సాత్విక్ భుజానికి గాయమవగా దాని నుంచి అతడు ఇంకా పూర్తిస్థాయిలో కోలుకోలేదు. ‘సాత్విక్ ఇంకా భుజం నొప్పితో బాధపడుతున్నాడు. ఈ టోర్నీలో వారు ఆడటం లేదు’ అని ఈ జోడీ కోచ్ కిమ్ హర్ తెలిపాడు. 2023లో డబుల్స్ టైటిల్ గెలిచిన సాత్విక్ ద్వయం టోర్నీ నుంచి దూరమవడం భారత్కు ఎదురుదెబ్బే. వీళ్లు వైదొలగడంతో మంగళవారం నుంచి మొదలుకానున్న ఈ టోర్నీలో భారత ఆశలన్నీ సింగిల్స్ ఆటగాళ్లు లక్ష్యసేన్, పీవీ సింధుపైనే ఉన్నాయి.
సింగిల్స్ క్యాటగిరీలో భారత్ నుంచి ఆఖరిసారి 1965లో దినేశ్ ఖన్నా టైటిల్ నెగ్గగా ఆ తర్వాత ఒక్కరు కూడా విజేతగా నిలువలేదు. ఇటీవలే ముగిసిన ఆల్ఇంగ్లండ్ చాంపియన్షిప్లో రన్నరప్గా నిలిచిన లక్ష్య.. అదే జోరును కొనసాగించాలని భారత్ భావిస్తున్నది. లక్ష్యతో పాటు శ్రీకాంత్, హెచ్ఎస్ ప్రణయ్, ప్రియాన్షు రజావత్ కూడా బరిలో ఉన్నారు. ఇక ఆల్ఇంగ్లండ్ ఆడేందుకు వెళ్తూ ఇరాన్ యుద్ధం కారణంగా దుబాయ్లో చిక్కుకుని ఇంటికి చేరుకున్న సింధు.. కొద్దిరోజుల పాటు ఆటకు దూరమైన విషయం తెలిసిందే. పునరాగమనంలో ఆమె ఎలా ఆడుతుందనేది ఆసక్తికరం! మహిళల సింగిల్స్లో ఉన్నతి, తన్వి, మాళవిక పోటీలో ఉన్నారు. పురుషుల డబుల్స్లో సాత్విక్ జోడీ స్థానంలో హరిహరన్, ఎంఆర్ అర్జున్ తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు.