షెన్జెన్: భారత స్టార్ బ్యాడ్మింటన్ జోడీ సాత్విక్ సాయిరాజ్-చిరాగ్ శెట్టి అంతర్జాతీయ స్థాయిలో నిలకడైన ప్రదర్శనతో దుమ్మురేపుతున్నారు. వరుస విజయాలతో అదరగొడుతున్న ఈ జంట చైనా మాస్టర్స్ సూపర్ సిరీస్లో సెమీఫైనల్కు దూసుకెళ్లింది. బీడబ్ల్యూఎఫ్ వరల్డ్ టూర్ సూపర్-750 టోర్నీ పురుషుల డబుల్స్ క్వార్టర్ ఫైనల్లో శుక్రవారం టాప్ సీడ్ సాత్విక్-చిరాగ్ ద్వయం 21-16, 21-14తో లియో రాలీ-డానియల్ మార్టీన్ (ఇండోనేషియా) జోడీపై నెగ్గింది. మరోవైపు పురుషుల సింగిల్స్లో భారత స్టార్ షట్లర్ హెచ్ఎస్ ప్రణయ్ అనవసర తప్పిదాలతో క్వార్టర్ ఫైనల్లో పరాజయం పాలయ్యాడు. కీలక పోరులో ప్రపంచ ఎనిమిదో ర్యాంకర్ ప్రణయ్ 9-21, 14-21తో కొడాయి నరోకా (జపాన్) చేతలో ఓడాడు. పూర్తి ఏకపక్షంగా సాగిన పోరులో ప్రణయ్ పెద్దగా ఆకట్టుకోలేకపోయాడు. పదే పదే తప్పులు చేసిన ప్రణయ్ అందుకు తగ్గ మూల్యం చెల్లించుకున్నాడు.
పురుషుల డబుల్స్ క్వార్టర్ ఫైనల్లో భారత జంట అద్వితీయ ప్రదర్శన కనబర్చింది. 46 నిమిషాల పాటు సాగిన పోరులో వరుస గేమ్ల్లో విజృంభించి ప్రత్యర్థికి కోలుకునే అవకాశం ఇవ్వకుండా మ్యాచ్ను ముగించింది. సందర్భానికి తగ్గట్లు తమ స్థానాలను మార్చుకుంటూ ముందుకు సాగిన సాత్విక్-చిరాగ్.. నెట్ గేమ్తో పాటు పవర్ఫుల్ షాట్లతో ఆకట్టుకున్నారు. ఒక దశలో చక్కటి ప్రదర్శన కనబర్చిన ఇండోనేషియా ప్లేయర్లు తొలి గేమ్ను 14-14తో సమం చేసి పోటీలోకి వచ్చారు. ఈ సమయంలో చిరాగ్ చక్కటి షాట్లతో కీలక పాయింట్లు కొల్లగొట్టడంతో గేమ్ మన సొంతమైంది. రెండో గేమ్లోనూ ప్రత్యర్థి నుంచి ప్రతిఘటన ఎదురైనా.. మనవాళ్లు ఏమాత్రం వెనక్కి తగ్గకుండా అదే జోరు కొనసాగిస్తూ.. వరుస గేమ్ల్లో పని పూర్తి చేశారు. ఈ ఏడాది ఇండోనేషియా సూపర్-1000, కొరియా సూపర్-500, స్విస్ సూపర్-300 టైటిల్స్ ఖాతాలో వేసుకున్న సాత్విక్-చిరాగ్ జంట.. శనివారం సెమీఫైనల్లో హె జి టింగ్-రెన్ జియాంగ్ (చైనా) జోడీతో తలపడనుంది.