అంచనాలకు మించి రాణిస్తున్న సాత్విక్ సాయిరాజ్-చిరాగ్ శెట్టి జంట ప్రతిష్ఠాత్మక ప్రపంచ బ్యాడ్మింటన్ చాంపియన్షిప్లో సంచలనం సృష్టించింది. క్వార్టర్ ఫైనల్లో ప్రపంచ చాంపియన్లను ఓడించిన ఈ జోడీ.. ఈ టోర్నీ పురుషుల డబుల్స్లో దేశానికి తొలి పతకం ఖరారు చేసింది. ఇండియా ఓపెన్, థామస్ కప్, కామన్వెల్త్ గేమ్స్లో స్వర్ణాలు చేజిక్కించుకున్న ఈ ద్వయం.. ప్రపంచ చాంపియన్షిప్లో కొత్త చరిత్ర లిఖించింది. పురుషుల సింగిల్స్ క్వార్టర్ ఫైనల్లో హెచ్ఎస్ ప్రణయ్ ఓటమి పాలవగా.. ఆశలు రేపిన అర్జున్-ధ్రువ్ జంట క్వార్టర్స్లో పోరాటం ముగించింది.
టోక్యో: భారత స్టార్ షట్లర్లు సాత్విక్ సాయిరాజ్-చిరాగ్ శెట్టి ప్రపంచ బ్యాడ్మింటన్ చాంపియన్షిప్లో నయా చరిత్ర లిఖించారు. పురుషుల డబుల్స్లో దేశానికి తొలి పతకం ఖాయం చేసి రికార్డుల్లోకెక్కారు. జపాన్ వేదికగా జరుగుతున్న టోర్నీ పురుషుల డబుల్స్ క్వార్టర్ ఫైనల్లో శుక్రవారం ఏడో సీడ్ సాత్విక్-చిరాగ్ జంట 24-22, 15-21, 21-14తో ప్రపంచ చాంపియన్స్ టకురో హోకి-యుగో కోబాయెషి (జపాన్) ద్వయంపై గెలుపొందింది. మహిళల డబుల్స్లో గుత్తా జ్వాల-అశ్విని పొన్నప్ప జంట 2011లో ఈ టోర్నీలో కాంస్యం గెలుచుకోగా.. తాజా ప్రదర్శనతో డబుల్స్లో దేశానికి రెండో పతకం ఖాయమైంది. ఓవరాల్గా ప్రపంచ చాంపియన్షిప్లో దేశానికి ఇది 13వ పతకం కావడం విశేషం. గాయం కారణంగా టోర్నీకి దూరమైన భారత స్టార్ షట్లర్ పీవీ సింధు అత్యధికంగా 5 పతకాలు ఖాయం చేసుకుంది. పురుషుల సింగిల్స్లో కిడాంబి శ్రీకాంత్ పోరాటం క్వార్టర్స్తోనే ముగియగా.. డబుల్స్లో ధ్రువ్ కపిల-అర్జున్ జోడీ కూడా క్వార్టర్ ఫైనల్లోనే వెనుదిరిగింది. ఇక ఈ మెగాటోర్నీలో భారత్ నుంచి సాత్విక్-చిరాగ్ ద్వయం మాత్రమే పోటీలో ఉంది. ప్రపంచ ఎనిమిదో ర్యాంకర్ ప్రణయ్ 21-19, 6-21, 18-21తో జున్ పెంగ్ (చైనా) చేతిలో ఓడాడు. డబుల్స్ క్వార్టర్స్లో ధ్రువ్-అర్జున్ 8-21, 14-21తో మూడుసార్లు చాంపియన్స్ మహమ్మద్ ఎహసాన్-హెండ్రా సెటివాన్ (ఇండోనేషియా) చేతిలో పరాజయం పాలయ్యారు.
ప్రపంచ బ్యాడ్మింటన్ చాంపియన్షిప్ పురుషుల డబుల్స్లో భారత్కు ఇదే తొలి పతకం కాగా.. మహిళల డబుల్స్లో గుత్తా జ్వాల-అశ్విని పొన్నప్ప జోడీ 2011లో కాంస్యం గెలుచుకుంది.
ఇదంతా కలలా ఉంది. ఇండియా ఓపెన్ ఆ తర్వాత థామస్ కప్ అటు నుంచి కామన్వెల్త్గేమ్స్ ఇప్పుడిది. మా ఆనందాన్ని మాటల్లో వర్ణించలేం. ఇది మాకు చాలా పెద్ద గెలుపు. ప్రపంచ చాంపియన్ జోడీపై విజయం సాధించడం ఎప్పుడూ ప్రత్యేకమే. ఎలాంటి తడబాటుకు లోనుకాకుండా ఆడటం ఆనందాన్నిచ్చింది. ఇక్కడితో ఆగిపోవాలనుకోవడం లేదు. సెమీస్లో నెగ్గి ఫైనల్ చేరాలని బలంగా కోరుకుంటున్నాం.
– సాత్విక్ సాయిరాజ్