హైదరాబాద్, ఆట ప్రతినిధి: రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ పుట్టిన రోజు పురస్కరించుకుని సోమవారం ‘తెలంగాణ ట్రై క్రీడావేడుక’ ఘనంగా నిర్వహిస్తున్నారు. సాట్స్ ఆధ్వర్యంలో సైక్లింగ్, స్కేటింగ్, రెజ్లింగ్ అంశాల్లో పోటీలు నిర్వహిస్తున్నారు. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లను ఆదివారం సాట్స్ చైర్మన్ ఆంజనేయగౌడ్ పరిశీలించారు. ఉదయం ఆరు గంటలకు నీరా కేఫ్ దగ్గర సైక్లింగ్ పోటీలను మంత్రులు మహమూద్ అలీ, శ్రీనివాస్యాదవ్, శ్రీనివాస్గౌడ్, సాట్స్ చైర్మన్ ప్రారంభించనున్నారు.
ఈ కార్యక్రమానికి క్రీడాశాఖ ముఖ్య కార్యదర్శి శైలజ రామయ్యర్, డైరెక్టర్ లక్ష్మి, వివిధ క్రీడా సంఘాల ప్రతినిధులు హాజరుకానున్నారు. మంత్రి కేటీఆర్ జన్మదినం సందర్భంగా విద్యార్థులు, యువతలో క్రీడా స్ఫూర్తి రగిలించేందుకు క్రీడా సంఘాలు ముందుకు రావడం హర్షణీయమని సాట్స్ చైర్మన్ అన్నారు. సీఎం కప్ స్ఫూర్తితో మరింత ముందుకు సాగుతామని పేర్కొన్నారు.