రాజ్కోట్: ఎన్నో భావోద్వేగాల కలయిక భారత్, ఇంగ్లండ్ మూడో టెస్టు మ్యాచ్ వేదికైంది. ఎన్నాళ్లో వేచిన హృదయం అన్న రీతిలో ఏండ్లుగా ఎదురుచూస్తున్న క్షణం రానే వచ్చింది. దేశవాళీ టోర్నీల్లో దుమ్మురేపుతూ జాతీయ జట్టు పిలుపు కోసం ఇన్నాళ్లు వేచిచూసిన యువ క్రికెటర్లు సర్ఫరాజ్ఖాన్, ధృవ్ జురెల్ ఎట్టకేలకు భారత టెస్టు జట్టులో అరంగేట్రం చేశారు. విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్, శ్రేయాస్ అయ్యర్ లాంటి స్టార్ క్రికెటర్ల గైర్హాజరీలో సర్ఫరాజ్, జురెల్కు చాన్స్ లభించింది. సర్ఫరాజ్కు క్రికెట్ దిగ్గజం అనిల్ కుంబ్లే క్యాప్ను అందించగా, జురెల్ను వెటరన్ వికెట్కీపర్ దినేశ్ కార్తీక్ జట్టులోకి ఆహ్వానించాడు.
ఈ సందర్భంగా భావోద్వేగ సన్నివేశాలు చోటు చేసుకున్నాయి. తన కొడుకు సర్ఫరాజ్ అరంగేట్రం కోసం ఎదురుచూసిన నౌషద్ఖాన్ కన్నీటి పర్యంతం అయ్యాడు. దేశవాళీల్లో రాణిస్తున్న కొడుకుకు చాన్స్ దక్కకపోవడంపై ఇన్నాళ్లు వేచిచూసిన నౌషద్ భావోద్వేగానికి గురయ్యాడు. సర్ఫరాజ్ను గట్టిగా కౌగిలించుకుని తన భావాన్ని వ్యక్తపరిచాడు. మరోవైపు సర్ఫరాజ్ తన భార్యను ఓదార్చడం అక్కడున్న వారిని ఒక రకంగా కదిలించింది. మొత్తంగా దేశానికి ఆడాలన్న తన తండ్రి కల ఇన్ని రోజులకు నెరవేరినందుకు సంతోషంగా ఉందని సర్ఫరాజ్ సంతోషం వ్యక్తం చేశాడు.