దేశవాళీలో పరుగుల వరద పారిస్తున్న ముంబై బ్యాటర్ సర్ఫరాజ్ ఖాన్ త్వరలోనే భారత జట్టులోకి రాబోతున్నాడు. రంజీ ట్రోఫీ-2022 లో భాగంగా భీకర ఫామ్ లో ఉన్న ఈ 24 ఏండ్ల కుర్రాడు.. జాతీయ జట్టులో పలువురు ఆటగాళ్లకు పోటీగా వస్తున్నాడని, అతడికి త్వరలోనే టీమిండియాలో చోటు దక్కడం ఖాయమని బీసీసీఐ వర్గాలు తెలిపాయి. ఈ సీజన్ లో సర్ఫరాజ్ ఇప్పటికే 937 పరుగులు చేసి ఎవరికీ అందనంత ఎత్తులో నిలిచాడు.
సర్ఫరాజ్ ను జాతీయ జట్టులోకి తీసుకోవడంపై బీసీసీఐకి చెందిన ఓ అధికారి మాట్లాడుతూ.. ‘సర్ఫరాజ్ అద్భుత ఫామ్ ను కొనసాగిస్తున్నాడు. ఇప్పుడు అతడి పేరును జాతీయ జట్టుకు పట్టించుకోకపోవడం అసాధ్యం. గత కొన్నాళ్లుగా నిలకడగా ఆడుతున్న అతడు భారత జట్టులో పలువురు ఆటగాళ్లకు పోటీగా నిలుస్తున్నాడు. బంగ్లాదేశ్ టెస్టు సిరీస్ కోసం అతడిని ఎంపిక చేసే అవకాశముంది..’ అని తెలిపాడు.
భారత జట్టు ప్రస్తుతం ఇంగ్లాండ్ తో గతేడాది మిగిలిపోయిన టెస్టు ఆడేందుకు వెళ్లింది. ఈ టెస్టు తర్వాత టీమిండియా ఆడేవన్నీ టీ20 సిరీస్ లే. అక్టోబర్ లో ఆసీస్ వేదికగా జరగాల్సి ఉన్న టీ20 ప్రపంచకప్ తర్వాత టీమిండియా.. బంగ్లాదేశ్ పర్యటనకు వెళ్లనున్నది. అక్కడ బంగ్లాతో రెండు టెస్టులు ఆడాల్సి ఉంది. ఈ పర్యటనకు సర్ఫరాజ్ ఖాన్ ను ఎంపిక చేయడం లాంఛనమే అని తెలుస్తున్నది.
కాగా ఈ రంజీ సీజన్ లో సర్ఫరాజ్ ఖాన్.. ఆరు మ్యాచుల్లో 937 పరుగులు చేశాడు. ఇందులో నాలుగు సెంచరీలు రెండు హాఫ్ సెంచరీలు కూడా ఉన్నాయి. ఒక సీజన్ లో 900 కంటే ఎక్కువ పరుగులు చేయడం సర్ఫరాజ్ కు ఇది రెండోసారి. గత సీజన్ (2019-20లో) కూడా అతడు 928 రన్స్ చేశాడు. మధ్యప్రదేశ్ తో బెంగళూరులో జరుగుతున్న రంజీ ట్రోఫీ ఫైనల్స్ లో సర్ఫరాజ్.. సెంచరీ (134) తో ముంబైని ఆదుకున్న విషయం తెలిసిందే. ఈ మ్యాచ్ లో మరో ఇన్నింగ్స్ ఆడే అవకాశం కూడా ఉండటంతో అతడు వెయ్యి పరుగులు చేసే అవకాశం కూడా ఉంది.