సిటీబ్యూరో: ఏడవ జాతీయస్థాయి పికిల్బాల్ టోర్నీ శుక్రవారం ఎల్బీ ఇండోర్ స్టేడియం వేదికగా ఘనంగా ప్రారంభమైంది. మొత్తం 18 రాష్ర్టాల నుంచి ప్లేయర్లు టోర్నీలో బరిలోకి దిగుతున్నారు. తెలంగాణ వేదికగా తొలిసారి జరుగుతున్న పోటీల కోసం రాష్ట్ర పికిల్బాల్ అసోసియేషన్ అన్ని ఏర్పాట్లు చేసింది. ప్రారంభ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన రాష్ట్ర పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్ మాట్లాడుతూ ‘ప్రభుత్వం క్రీడలను ఎంతగానో ప్రోత్సహిస్తున్నది.
జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో రాణిస్తున్న ప్లేయర్లను సీఎం కేసీఆర్ తగిన రీతిలో గౌరవిస్తున్నారు. ప్రతిభ కల్గిన ప్లేయర్లను వెలుగులోకి తీసుకొచ్చేందుకు ప్రతి గ్రామంలో క్రీడా ప్రాంగణం ఏర్పాటు చేస్తున్నాం. పికిల్బాల్ అనేది ఫన్ అండ్ ఫిట్నెస్ గేమ్. పసిపిల్లల నుంచి 60 ఏండ్ల వయసు వారు కూడా ఆడేందుకు అనుకూలంగా ఉంటుంది. తక్కువ స్థలంలో ఈ ఆటను సులువుగా ఆడవచ్చు’ అని అన్నారు. ఈ కార్యక్రమంలో అమెచ్యూర్ తెలంగాణ పికిల్బాల్ అసోసియేషన్(ఏటీపీఏ) అధ్యక్షుడు రావుల శ్రీధర్రెడ్డి, బేవరెజెస్ కార్పొరేషన్ చైర్మన్ గజ్జెల నగేశ్ తదితరులు పాల్గొన్నారు.