యువ ఆటగాళ్లతో కూడిన భారత జట్టు అద్భుతాన్ని ఆవిష్కరించింది. దక్షిణాఫ్రికా పర్యటనలో రెండోసారి వన్డే సిరీస్ కైవసం చేసుకొని నయా చరిత్ర లిఖించింది. అంతర్జాతీయ క్రికెట్లో అరంగేట్రం చేసిన తొమ్మిదేండ్లకు సంజూ శాంసన్ తొలి సెంచరీ తన పేరిట లిఖించుకొని జట్టుకు భారీ స్కోరు అందించగా.. తెలంగాణ కుర్రాడు తిలక్ వర్మ, నయా ఫినిషర్ రింకూ సింగ్ తమ వంతు బాధ్యత నిర్వర్తించారు. ఆనక ఛేదనలో ఓపెనర్ జోర్జి పోరాడినా.. మన బౌలర్లు సమిష్టిగా సత్తాచాటి సఫారీలకు అడ్డుకట్ట వేశారు.
Team India | పార్ల్: దక్షిణాఫ్రికా గడ్డపై భారత జట్టు రెండో వన్డే సిరీస్ కైవసం చేసుకుంది. 2018లో విరాట్ కోహ్లీ సారథ్యంలోని టీమ్ఇండియా తొలిసారి సఫారీ నేలపై వన్డే సిరీస్ గెలువగా.. ఇప్పుడు రాహుల్ సారథ్యంలోని భారత జట్టు సేమ్ సీన్ రిపీట్ చేసింది. గురువారం జరిగిన మూడో వన్డేలో భారత్ 78 పరుగుల తేడాతో జయకేతనం ఎగరవేసింది. దీంతో మూడు మ్యాచ్ల సిరీస్ను 2-1తో కైవసం చేసుకుంది. టాస్ ఓడి మొదట బ్యాటింగ్కు దిగిన భారత్ నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్లకు 296 పరుగులు చేసింది.
మూడో స్థానంలో బ్యాటింగ్కు దిగిన సంజూ శాంసన్ (114 బంతుల్లో 108; 6 ఫోర్లు, 3 సిక్సర్లు) వన్డేల్లో తొలి సెంచరీ నమోదు చేసుకోగా.. హైదరాబాదీ తిలక్ వర్మ (52; 5 ఫోర్లు, ఒక సిక్సర్) అర్ధశతకంతో మెరిశాడు. చివర్లో రింకూ సింగ్ (27 బంతుల్లో 38; 3 ఫోర్లు, 2 సిక్సర్లు) విలువైన పరుగులు చేశాడు. గత రెండు మ్యాచ్ల్లో అర్ధశతకాలు సాధించిన సాయి సుదర్శన్ (10) విఫలం కాగా.. ఈ మ్యాచ్ ద్వారా అంతర్జాతీయ వన్డే అరంగేట్రం చేసిన రజత్ పాటిదార్ (22), కెప్టెన్ కేఎల్ రాహుల్ (21) ఎక్కువసేపు నిలువలేకపోయారు. దక్షిణాఫ్రికా బౌలర్లలో హెన్రిక్స్ 3, బర్గర్ రెండు వికెట్లు పడగొట్టారు. అనంతరం లక్ష్యఛేదనలో దక్షిణాఫ్రికా 45.5 ఓవర్లలో 218 పరుగులకు ఆలౌటైంది. గత మ్యాచ్ సెంచరీ హీరో జోర్జి (81; 6 ఫోర్లు, 3 సిక్సర్లు) మరోసారి సత్తాచాటగా.. కెప్టెన్ మార్క్మ్ (36) పర్వాలేదనిపించాడు. భారత బౌలర్లలో అర్ష్దీప్ సింగ్ 4, వాషింగ్టన్ సుందర్, అవేశ్ చెరో రెండు వికెట్లు పడగొట్టారు. శాంసన్కు మ్యాన్ ఆఫ్ మ్యచ్, అర్ష్దీప్కు మ్యాన్ ఆఫ్ ది సిరీస్ అవార్డులు దక్కాయి.
సంజూ శాంసన్.. ఈ పేరు తలుచుకోగానే.. ప్రతి భారత అభిమానికి గుర్తొచ్చే మొదటి పదం దురదృష్టవంతుడు. అపార ప్రతిభ ఉన్నా.. సరైన అవకాశాలు రాక.. వచ్చిన వాటిలో అద్భుతాలు చేయలేక.. అంతర్జాతీయ క్రికెట్లో తనదైన ముద్ర వేసేందుకు తీవ్ర ఇబ్బందులు పడుతున్న ప్లేయర్గా శాంసన్ సుపరిచితుడు. దేశవాళీ టోర్నీలతో పాటు ఐపీఎల్లో మెరుగైన ప్రదర్శన చేసిన సంజూ అప్పుడెప్పుడో 2015లో జాతీయ జట్టు తరఫున అరంగేట్రం చేసినా.. ఈ తొమ్మిదేండ్లలో అతడు వేళ్ల మీద లెక్క పెట్టగల వన్డేలు మాత్రమే ఆడాడు.
అందులో మంచి గణాంకాలే ఉన్నా.. మ్యాచ్ విన్నింగ్ పర్ఫామెన్స్లు పెద్దగా లేకపోవడంతో అతడికి ఎక్కువ అవకాశాలు రాలేదు. ఇప్పుడు వన్డే ప్రపంచకప్ అనంతరం సీనియర్లు విశ్రాంతి తీసుకుంటుండంతో.. సఫారీ టూర్లో అతడికి చాన్స్ దక్కింది. ఈ సారి దాన్ని రెండు చేతుల ఒడిసి పట్టుకున్న శాంసన్ అంతర్జాతీయ క్రికెట్లో తొలి సెంచరీతో చెలరేగాడు. అరంగేట్ర ఆటగాడు రజత్ పాటిదార్ త్వరగానే ఔట్ కావడంతో ఐదో ఓవర్లోనే క్రీజులోకి వచ్చిన సంజూ అక్కడి నుంచి బాధ్యతను భుజాలపై ఎత్తుకొని ఇన్నింగ్స్ నడిపించాడు. రాహుల్, తిలక్తో చక్కటి భాగస్వామ్యాలు నమోదు చేసి జట్టును సురక్షిత ప్రాంతాలకు చేర్చాడు. ఆఖర్లో రింకూ మెరుపులు మెరిపించడంతో టీమ్ఇండియా మంచి స్కోరు చేయగలిగింది.
భారత్: 296/8 (శాంసన్ 108, తిలక్ 52; హెన్రిక్స్ 3/63, బర్గర్ 2/64),
దక్షిణాఫ్రికా: 45.5 ఓవర్లలో 218 ఆలౌట్ (జోర్జి 81, మార్క్మ్ 36; అర్ష్దీప్ 4/30, సుందర్ 2/38).