ప్రతి క్రికెట్ కెరీర్లోనూ ఒక ఫేజ్ ఉంటుంది. ఆ సమయంలో ఎంత మంచి ఆటగాడైనా తక్కువ స్కోర్లకే అవుటైపోతూ ఉంటారు. ఏదీ కలిసిరాదు. ఫామ్ పూర్తిగా కోల్పోతారు. ఏం జరుగుతుందో అర్థం కాదు. అలాంటి అనుభవమే ప్రస్తుతం రాజస్థాన్ రాయల్స్ సారధి సంజూ శాంసన్కు కూడా ఎదురైంది.
ఇదే విషయాన్ని శాంసన్ ఇటీవల ‘‘బ్రేక్ఫాస్ట్ విత్ ఛాంపియన్స్’’ కార్యక్రమంలో వెల్లడించాడు. 2013, 2014 ఐపీఎల్ సీజన్లలో శాంసన్ అద్భుతంగా ఆడాడు. దాంతో 2015 జింబాబ్వే టూర్లో భారత్కు ఆడే అవకాశం లభించినా.. దాన్ని అతను ఉపయోగించుకోలేకపోయాడు.
ఆ తర్వాత దాదాపు ఐదేళ్లు తను ఘోరమైన ఫామ్లో ఉన్నానని, కేరళ జట్టులో కూడా స్థానం కోల్పోయానని శాంసన్ గుర్తుచేసుకున్నాడు.
‘‘అప్పుడు నాకు 20 ఏళ్లు ఉంటాయి అనుకుంటా.. తొలిసారి భారత్కు ఆడే అవకాశం వచ్చింది. మళ్లీ 25 ఏళ్లు వచ్చిన తర్వాత ఆ అవకాశం వచ్చింది. ఆ ఐదేళ్లు నా జీవితంలో చాలా సవాళ్లు ఎదుర్కొన్నా. కేరళ జట్టులో కూడా స్థానం కోల్పోయా. చివరకు నా మీద నాకే అనుమానం వచ్చేది’’ అని చెప్పాడు.
అసలు సంజూ శాంసన్ మళ్లీ పునరాగమనం చేయగలడా? అని తనకే అనుమానం కలిగేదన్నాడు. నిజాయితిగా, వాస్తవాలను పరిగణనలోకి తీసుకున్న ప్రతి ఒక్కరికీ అదే అనుమానం కలుగుతుందని అన్నాడు. ఈ సందర్భంగా ఒక అనుభవాన్ని గుర్తు చేసుకున్నాడు.
‘‘ఒకసారి బ్రబోర్న్ స్టేడియంలో మ్యాచ్ ఆడుతున్నాం. నేను చాలా త్వరగా అవుటైపోయా. ఎంత ఫ్రస్ట్రేషన్కు గురయ్యానంటే.. డ్రెస్సింగ్ రూంలోకి రాగానే కోపంగా బ్యాటు నేలకేసి కొట్టా. ఈ బ్యాట్ నువ్వే తీసుకో నేను కేరళ వెళ్లిపోతున్నా అని పెద్దగా అరిచి నడుచుకుంటూ మరీన్ డ్రైవ్కు వెళ్లిపోయా. అక్కడే ఒక మూడు, నాలుగు గంటలు కూర్చొని సముద్రం చూస్తూ కూర్చుండిపోయా.
అసలు ఇంకా క్రికెట్ ఆడటం అవసరమా? ఇంటికి వెళ్లిపోదామా? అనే ఆలోచనలు వచ్చాయి. ఆ తర్వాత నేను మళ్లీ తిరిగి వెళ్లే సరికి మ్యాచ్ పూర్తయిపోయింది. బ్యాటు విరిగిపోయి ఉండటం చూసి చాలా బాధేసింది. ఏ దిండు మీదనో దాన్ని విసిరి కొట్టి ఉండాల్సింది అనిపించింది’’ అని గుర్తుచేసుకున్నాడీ రాజస్థాన్ రాయల్స్ సారధి. ప్రస్తుత ఐపీఎల్ సీజన్లో మంచి ఫామ్ కనబరుస్తున్న సంజూ.. టీ20 ప్రపంచకప్ ఆడే భారత జట్టులో స్థానం సంపాదించినా ఆశ్చర్యం లేదు.