ఆర్హుస్ (డెన్మార్క్): సుదిర్మన్ కప్లో పెద్దగా ప్రభావం చూపలేకపోయిన భారత షట్లర్లు శనివారం నుంచి ప్రారంభం కానున్న థామస్, ఉబెర్ కప్లలో సత్తాచాటాలని భావిస్తున్నారు. డబుల్స్ జోడీ సాత్విక్ సాయిరాజ్-చిరాగ్ శెట్టి బరిలో దిగనుండటం పురుషుల టీమ్కు సానుకూలాంశం కాగా.. మహిళల విభాగంలో సైనా నెహ్వాల్ జట్టును ముందుండి నడిపించనుంది. థామస్ కప్లో నెదర్లాండ్స్తో భారత పురుషుల జట్టు తొలి మ్యాచ్ ఆడనుండగా.. ఉబెర్ కప్లో స్పెయిన్తో మహిళల జట్టు అమీతుమీ తేల్చుకోనుంది. పురుషుల విభాగంలో కిడాంబి శ్రీకాంత్, సాయిప్రణీత్, సమీర్ వర్మ, కిరణ్.. సింగిల్స్ మ్యాచ్లు ఆడనుండగా.. డబుల్స్లో ప్రపంచ పదో నంబర్ జంట సాత్విక్-చిరాగ్తో పాటు ధ్రువ్-అర్జున్, కృష్ణ ప్రసాద్-విష్ణు వర్ధన్ జోడీలు బరిలో దిగనున్నాయి. టోక్యో ఒలింపిక్స్ కాంస్య పతక విజేత పీవీ సింధు ఈ టోర్నీ నుంచి తప్పుకోగా.. మహిళల సింగిల్స్లో సైనా నెహ్వాల్, మాళవిక, అదితి, తస్నీమ్.. డబుల్స్లో సిక్కిరెడ్డి-అశ్విని పొన్నప్ప, తనీశ-రుతపర్ణ, గాయత్రి గోపీచంద్-త్రిశ జోడీ తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నాయి.